IND VS PAK: ‘ద్రోహి’ అన్న నోళ్లతో 'సింగ్ ఈజ్ కింగ్' అనిపించుకున్న అర్ష్దీప్
T20 World Cup 2022: ఆసియా కప్-2022లో పాక్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన సునాయసమైన క్యాచ్ను జారవిడిచి, టీమిండియా ఓటమికి పరోక్ష కారణంగా నిలిచి దారుణమైన ట్రోలింగ్ను ఎదుర్కొన్న టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్.. ఇవాళ (అక్టోబర్ 23) అదే దాయాదితో జరిగిన మ్యాచ్లో మహోగ్రరూపాన్ని ప్రదర్శించి తనను ఖలిస్తానీ అని ట్రోల్ చేసిన వాళ్లకు బంతితో బుద్ధిచెప్పాడు.
క్రికెట్లో క్యాచ్లో జరవిడచడం సాధారణమైన విషయమే అయినప్పటికీ.. కొందరు దురభిమానులు అర్షదీప్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏకంగా వికీపీడియాలో ఖలిస్తానీ అంటూ తీవ్రస్థాయిలో దూషణలకు దిగిన విషయం తెలిసిందే. తనపై దూషణలకు దిగిన వారికి అర్షదీప్.. ఇవాల్టి మ్యాచ్లో సత్తా చాటి 'సింగ్ ఈజ్ కింగ్' అని నిరూపించుకున్నాడు.
అర్షదీప్ ఈ మ్యాచ్లో బుమ్రా లేని లోటు తీర్చడంతో పాటు తనపై దురభిమానులు వేసిన నిందలను తుడిచిపెట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్కు అర్షదీప్ ఆరంభంలోనే పెద్ద బ్రేక్ ఇచ్చాడు. రెండో ఓవర్లో బాబర్ ఆజమ్, నాలుగో ఓవర్లో మహ్మద్ రిజ్వాన్లను పెవిలియన్కు పంపి పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
అనంతరం 17వ ఓవర్లో కీలకమైన అసిఫ్ అలీ వికెట్ తీసి పాక్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన అర్షదీప్ 32 పరుగులిచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్తో పాటు హార్ధిక్ పాండ్యా (3/30), షమీ (1/25), భువీ (1/22) రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
చదవండి: అప్పుడు రోహిత్.. ఇప్పుడు బాబర్; లెక్క సరిచేశారు
మీ అభిప్రాయం చెప్పండి
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు