ఐపీఎల్-2026 సీజన్ మెరుపులు తర్వాత సంప్రదాయ క్రికెట్ సమరానికి రంగం సిద్దమైంది. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)లో భాగం కానప్పటికీ.. అందరి దృష్టి మాత్రం ఈ ఏకైక మ్యాచ్ పైనే ఉంది. ఎందుకంటే సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత స్వదేశంలో భారత్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది.
అంతకంటే ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కూడా టీమిండియాకు ఘోర పరభావం ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్వదేశంలో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
అఫ్గాన్ కంటే భారత్ అన్ని విధాలగా పటిష్టంగా ఉన్నప్పటికి.. మైదానంలో ఆధిపత్య క్రికెట్ ఆడగలరా? లేదా అన్నది వేచి చూడాలి. ఈ మ్యాచ్తో కొన్ని కొత్త ముఖాలు అంతర్జాతీయ క్రికెట్కు పరిచయం అయ్యే అవకాశముంది. హర్ష్ దూబే, గుర్నార్ బ్రార్ వంటి యువ ఆటగాళ్లు డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా దేవ్దత్త్ పడిక్కల్ టెస్టుల్లో తిరిగి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ స్ధానంలో అతడిని ఆడించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2025-26లో ఈ కర్ణాటక బ్యాటర్ 54.30 సగటుతో 543 పరుగులు చేశాడు.
ధ్రువ్ జురెల్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలో ఎవరికో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండడంతో జురెల్ను బెంచ్కే పరిమితం చేసే అవకాశముంది. స్పెషలిస్ట్ బ్యాటర్ను ఆడించాలనుకుంటే నితీశ్ను పక్కన పెట్టక తప్పదు. ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.
భారత తుది జట్టు(అంచనా)
శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవ్దత్త్ పడిక్కల్. నితీష్ కుమార్ రెడ్డి/ ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.
చదవండి: క్రికెట్ దేవుడి రికార్డుకే ఎసరు.. చరిత్ర సృష్టించనున్న సూర్యవంశీ


