భారత ఓపెనర్‌ భారీ శతకం!.. పాపం పడిక్కల్‌! | IND A vs SL A 2nd Test Day 3 Lunch Break: Sai 153 Padikkal Misses 100 | Sakshi
Sakshi News home page

IND vs SL: భారత ఓపెనర్‌ భారీ శతకం!.. పాపం పడిక్కల్‌!

Jul 4 2026 12:50 PM | Updated on Jul 4 2026 1:03 PM

IND A vs SL A 2nd Test Day 3 Lunch Break: Sai 153 Padikkal Misses 100

PC: X

శ్రీలంక- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత్‌ జోరు కొనసాగిస్తోంది. గాలె వేదికగా శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి.. 88 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 343 పరుగులు సాధించింది. శ్రీలంక కంటే తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ తేలికగానే ఆధిక్యంలోకి వచ్చే స్థితిలో నిలిచింది.

కాగా 247/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది భారత్‌. ఈ క్రమంలో శతక వీరుడు, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ లంచ్‌ బ్రేక్‌ సమయానికి 153 పరుగులతో క్రీజులో నిలిచాడు. అయితే, దేవ్‌దత్‌ పడిక్కల్‌ మాత్రం సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 

తన ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగు కూడా జతచేయకుండానే 94 పరుగుల వద్ద కేశర నువంతా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌ 13 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగగా.. కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ 25 పరుగులతో.. సాయి సుదర్శన్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు.

రెండోరోజు ఆట సాగిందిలా..
శ్రీలంకతో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో సాయి సుదర్శన్‌ (184 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు. అతడితో పాటు దేవదత్‌ పడిక్కల్‌ (151 బంతుల్లో 94 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) కూడా రాణించాడు. 

ఈ ఇద్దరితో పాటు అమోన్‌ మోఖడే (38; 6 ఫోర్లు) కూడా ఫర్వాలేదనిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసింది.

తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం అమన్‌ అవుట్‌ కాగా... పడిక్కల్‌తో కలిసి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ... నిలదొక్కుకున్న తర్వాత వేగం పెంచింది. లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. 

రెండో వికెట్‌కు 181 పరుగులు
ఈ క్రమంలో గత మ్యాచ్‌లోనూ సెంచరీ బాదిన సుదర్శన్‌ మరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతడికిది పదో సెంచరీ. పడిక్కల్‌ 94 పరుగుల వద్ద నిలిచాడు.

వీరిద్దరూ అబేధ్యమైన రెండో వికెట్‌కు 181 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో కేశర నువంతా ఒక వికెట్‌ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 288/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక జట్టు చివరకు 110 ఓవర్లలో 366 పరుగులకు ఆలౌటైంది. 

లంక కెప్టెన్‌ సెంచరీ
కెప్టెన్‌ సహాన్‌ అరాచిగే (207 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... తక్కినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో గుర్‌నూర్‌ బ్రార్, సారాన్ష్‌ జైన్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా... యశ్‌ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి అనధికారిక టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.

చదవండి: నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement