లం‍క జట్టును వదలని కరోనా భూతం.. తాజాగా క్రికెటర్‌కు పాజిటివ్‌ | Sri Lankan Cricketer Tests Positive For COVID | Sakshi
Sakshi News home page

లం‍క జట్టును వదలని కరోనా భూతం.. తాజాగా క్రికెటర్‌కు పాజిటివ్‌

Jul 11 2021 3:02 PM | Updated on Jul 11 2021 3:02 PM

Sri Lankan Cricketer Tests Positive For COVID - Sakshi

కొలంబో: ఇంగ్లండ్‌ పర్యటన నుంచి తిరిగొచ్చిన శ్రీలంక క్రికెట్‌ జట్టును కరోనా భూతం వదలట్లేదు. తొలుత బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌కు వైరస్‌ నిర్ధారణ కాగా, ఆ తరువాత డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు కరోనా సోకిందని తేలింది. తాజాగా, సందున్‌ వీరక్కోడి అనే క్రికెటర్‌ మహమ్మారి బారిన పడ్డాడని తేలడంతో సహచర క్రికెటర్లతో పాటు భారత శిబిరంలోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరక్కోడిని లంక క్రికెట్‌ బోర్డు ఐసోలేషన్‌కు తరలించింది. అతడితో కలిసున్న వారినీ కూడా ప్రత్యేక ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపింది.

కాగా, అంతకుముందు వీరక్కోడి.. మరో 15 మంది సీనియర్‌ క్రికెటర్లతో కలిసి సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్లో బస చేశాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు సాధన మ్యాచులు ఆడించేందుకు కొందరు క్రికెటర్లను లంక క్రికెట్‌ బోర్డు శుక్రవారం రాత్రి దంబుల్లాకు పంపింది. అందులో వీరక్కోడి సహా 26 మంది క్రికెటర్లు ఉన్నారు. దీంతో వీరంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇంగ్లండ్‌ నుంచి తిరిగొచ్చిన లంక జట్టులో వీరక్కోడి సభ్యుడు కాకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే, కరోనా దెబ్బకు శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఐదు రోజులు ఆలస్యంగా మొదలుకానుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 13న ప్రారంభంకావాల్సిన వన్డే సిరీస్‌.. జులై 18 నుంచి మొదలవుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. లంక క్రికెట్‌ జట్టులో వరుసగా కరోనా కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు 18, 20, 23 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం జులై 25 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభమవుతోందని సూచన ప్రాయంగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement