
సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో శ్రీలంకకు మరో పరాభావం ఎదురైంది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. ఆఖరి లీగ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో అన్నేరీ డెర్క్సెన్(104) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. క్లోయ్ ట్రయాన్(74), లారా వోల్వార్డ్(33), బ్రిట్స్(38), నాడిన్ డి క్లెర్క్(32) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. లంక బౌలర్లలో దేవ్మీ విహంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. ఆతపట్టు, మనుడి నానాయక్కర తలా వికెట్ సాధించారు.
అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 42.5 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో చామరి ఆతపట్టు(52) టాప్ స్కోరర్గా నిలవగా.. అనుష్క సంజీవని(43), హర్షితా సమరవిక్రమ(33), పెరీరా(30) రాణించారు.
సఫారీ బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ ఐదు వికెట్లతో చెలరేగింది. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఆమెతో పాటు ఖాఖా రెండు, శేష్నీ నాయుడు, స్మిత్ తలా వికెట్ సాధించారు. ఇక మే 11(ఆదివారం) జరగనున్న ఫైనల్ పోరులో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.