డే అండ్ నైట్‌ టెస్టులో సెంచరీ.. స్మృతి మంధాన సరి కొత్త చరిత్ర

Smriti Mandhana becomes 1st Indian woman to score century in pink-ball Test vs Australia - Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 276/5

వర్షంతో రెండో రోజూ అంతరాయం

ఆస్ట్రేలియాతో డే నైట్‌ టెస్టు

Smriti Mandhana Maiden Century: భారత ఓపెనర్‌ స్మృతి మంధాన (216 బంతుల్లో 127; 22 ఫోర్లు, 1 సిక్స్‌) ‘పింక్‌ బాల్‌’  టెస్టులో చరిత్రకెక్కింది. భారత్‌ ఆడుతున్న తొలి డే నైట్‌ టెస్టులో ఆమె శతకం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో ఆమె సెంచరీ హైలైట్‌గా నిలిచింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. రెండో రోజు వర్షం, ప్రతికూల వాతా వరణంతో 57.4 ఓవర్ల ఆటే సా«ధ్యమైంది. డిన్నర్‌ బ్రేక్‌ తర్వాత ఆట కాసేపే (17 ఓవర్లు) జరిగింది.   

పటిష్టస్థితిలో భారత్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 132/1తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ను స్మృతి పటిష్ట స్థితిలో నిలిపింది. ఆట మొదలైన రెండో ఓవర్లోనే పెర్రీ క్యాచ్‌ జారవిడువడటంతో బతికిపోయిన స్మృతి తర్వాత ఎలాంటి పొరపాటుకు తావివ్వలేదు. స్ట్రయిట్‌ డ్రైవ్‌లతో బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఆఫ్‌సైడ్‌లో ఫీల్డర్లను పదేపదే పరిగెత్తించింది. ఆమె చేసిన 127 పరుగుల్లో 94 (22 ఫోర్లు, సిక్స్‌) పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం.

170 బంతుల్లో కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేసిన ఆమె రెండో వికెట్‌కు పూనమ్‌ రౌత్‌తో కలిసి 102 పరుగులు జతచేసింది. స్వల్ప వ్యవధిలో స్మృతితో పాటు రౌత్‌ (36; 2 ఫోర్లు) నిష్క్రమించాక 231/3 స్కోరు వద్ద భారత్‌ భోజన విరామానికెళ్లింది. తర్వాత కెపె్టన్‌ మిథాలీ రాజ్‌ (30; 5 ఫోర్లు), యస్తిక భాటియా (19) కాసేపు ఆడారు. ఆట నిలిచే సమయానికి దీప్తి శర్మ (12 బ్యాటింగ్‌), తానియా (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. సోఫీ
మోలినెక్స్‌కు 2 వికెట్లు దక్కాయి.   

ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ మహిళా క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు మోలీ హైడ్‌ (124 నాటౌట్‌–ఇంగ్లండ్‌; 1949లో) పేరిట ఉండేది.  

ఆ్రస్టేలియా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌ స్మృతి. సంధ్యా అగర్వాల్‌ (134; 1984లో) తర్వాత ఆ్రస్టేలియా జట్టుపై టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్‌ స్మృతి.  

ఆ్రస్టేలియా జట్టుపై వన్డేల్లో, టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌ స్మృతి. గతంలో ఎనిడ్‌ బేక్‌వెల్‌ (ఇంగ్లండ్‌), దెబోరా హాక్లీ (న్యూజిలాండ్‌), క్లెయిర్‌ టేలర్‌ (ఇంగ్లండ్‌) మాత్రమే ఈ ఘనత సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top