
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో శనివారం ఈడెన్గార్డెన్స్ వేదికగా కీలకపోరులో తలపడేందుకు పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లళాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఐదో స్ధానంలో ఉండగా.. కోల్కతా ఏడో స్ధానంలో ఉంది. ఇరు జట్లకు ఇంకా ఆరు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్కు ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అయ్యర్ తన మాజీ జట్టు కేకేఆర్పై మరోసారి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దంగా ఉన్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.కాగా శ్రేయస్ అయ్యర్ గతేడాది సీజన్లో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్ను అందించాడు. కానీ అనూహ్యంగా మెగా వేలానికి ముందు అయ్యర్ను రిటైన్ చేసుకోకుండా కేకేఆర్ ఫ్రాంచైజీ అందరికి షాకిచ్చింది. కేకేఆర్ నిర్ణయంతో శ్రేయస్ కూడా నిరాశచెందాడు. తనతో రిటెన్షన్ కోసం కనీసం సంప్రదింపులు కూడా జరపనట్లు శ్రేయస్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే వేలంలోకి వచ్చిన అయ్యర్ను రూ.26 .75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే కేకేఆర్ను ఓసారి పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్ర సృష్టించింది. నేడు జరగనున్న మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రేయస్ సేన భావిస్తోంది.
"కేకేఆర్పై శ్రేయస్ అయ్యర్ చాలా కోపంగా ఉంటాడు. ఆటగాళ్లు ఫామ్లో లేకపోతే లేదా కెప్టెన్గా విఫలమైతే ఏ ఫ్రాంచైజీ అయినా వేలంలోకి విడిచిపెడుతోంది. కానీ అయ్యర్ కథ వేరు. టైటిల్ను అందించిన కెప్టెన్ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నిజంగా ఈ నిర్ణయం ఎవరినైనా బాధిస్తుంది. టైటిల్ను అందించిన జట్టుకు ఏ కెప్టెనైనా ఉండాలని భావించడు.
తనను రిటైన్ చేసుకోకపోవడంతో అయ్యర్ చాలా బాధపడ్డాడు. అయితే కేకేఆర్ విడిచిపెట్టడంతో అయ్యర్కు ఒకవంతు మంచే జరిగింది. అతడు భారీ ధరకు పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. మరోసారి కేకేఆర్పై తనంటో నిరూపించకోవాల్సిన సమయం వచ్చింది. పంజాబ్కు అయ్యర్ మరో రెండు పాయింట్లను తీసుకువస్తాడని ఆశిస్తున్నాను" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.
చదవండి: ఈసారి వేలం వేస్ట్.. ధోని కేవలం బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా విమర్శలు