టీమిండియా కెప్టెన్గా తొలి విజయం కోసం శ్రేయస్ అయ్యర్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో భారత టీ20 పగ్గాలను చేపట్టిన శ్రేయస్.. జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. అతడి సారథ్యలో భారత జట్టు వరుసగా మూడు ఓటములను చూవిచూసింది.
ఐర్లాండ్తో తొలిసారి సిరీస్ను కోల్పోయిన భారత్, ఇప్పుడు ఇంగ్లండ్ టూర్లో అదే తీరును కనబరుస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో మెన్ ఇన్ బ్లూ ఓటమి పాలైంది.
ఇప్పుడు శ్రేయస్ సేన ఆతిథ్య జట్టుతో ట్రెండ్బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20లో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్తో తిరిగి గెలుపు బాట పట్టాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
బిష్ణోయ్పై వేటు
రెండో టీ20లో దారుణంగా విఫలమైన స్పిన్నర్ రవి బిష్ణోయ్పై వేటు వేసేందుకు టీమ్ మేనెజ్మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేశాడు.
తన అరంగేట్ర మ్యాచ్లో ప్రిన్స్ అదరగొట్టాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి ఇంగ్లండ్తో తొలి రెండో టీ20లకు స్పిన్నర్ బిష్ణోయ్ కోసం ప్రిన్స్ను గంభీర్ అండ్ కో పక్కన పెట్టింది. కానీ బిష్ణోయ్ పూర్తిగా తేలిపోవడంతో ప్రిన్స్ యాదవ్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లోకి రావడం దాదాపు ఖాయమైనట్లే.
ఈ ఢిల్లీ పేసర్కు కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్ చేయగలడు. పిన్ పాయింట్ యార్కర్ల వేయడంలో దిట్ట. ప్రిన్స్ యాదవ్ పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లతో కలిసి బంతిని పంచుకోనున్నాడు. కాగా ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున ప్రిన్స్ అసాధరణ ప్రదర్శన చేశాడు. దీంతో జాతీయ సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది. అఫ్గాన్ సిరీస్లో వన్డే అరంగేట్రం కూడా చేశాడు.
చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం!


