శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి | Shreyas Iyer Creates Huge Unwanted Record Over Loss Vs England In 2nd T20I After Four Winless Matches, Read Story Inside | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

Jul 5 2026 11:01 AM | Updated on Jul 5 2026 11:48 AM

Shreyas Iyer creates huge unwanted record after loss vs England in 2nd T20I

భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తొలి భారత కెప్టెన్‌గా అపఖ్యాతి పాలయ్యాడు. కొద్ది రోజుల కిందట ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌.. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం​ కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇలా చూస్తే శ్రేయస్‌ భారత టీ20 కెప్టెన్‌గా తన కెరీర్‌ను హ్యాట్రిక్‌ ఓటములతో మొదలుపెట్టాడు.

ఈ అవాంఛనీయ రికార్డులతో పాటు శ్రేయస్‌ మరో అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. కెప్టెన్‌గా చివరి 11 మ్యాచ్‌ల్లో ఏకంగా 9 మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించలేకపోయాడు. భారత టీ20 కెప్టెన్‌గా కెరీర్‌ ప్రారంభించడానికి ముందు అతడు ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్‌ తన చివరి 7 మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరింట తన జట్టును పరాజయాలబాట పట్టించాడు. ఆ ఒక్క గెలుపు చివరి లీగ్‌ మ్యాచ్‌లో వచ్చింది.

ఈ లెక్కన శ్రేయస్‌ తన చివరి 11 ఐపీఎల్‌, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించాడు. ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉందన్న కారణంగా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న శ్రేయస్‌ ఇలాంటి చెత్త ప్రదర్శనలు చేస్తుండటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. భారత కెప్టెన్‌గా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్‌ ఖాతా కూడా తెరవలేకపోవడం ఫ్యాన్స్‌ను విస్మయానికి గురి చేస్తుంది.

శ్రేయస్‌ తాజా ఓటమి విషయానికొస్తే.. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. అభిషేక్‌ శర్మ (43), ఇషాన్‌ కిషన్‌ (49), శ్రేయస్‌ అయ్యర్‌ (37), తిలక్‌ వర్మ (24 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా అరంగేట్రం చేసిన చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ రెండు సిక్సర్లు బాదినా, 14 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు.

అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. జేకబ్‌ బేతెల్‌ (78 నాటౌట్‌) చెలరేగి ఆడి అద్భుత విజయాన్నందించాడు. అతడికి కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (39), టామ్‌ బాంటన్‌ (39) సహకరించారు. ఓ దశలో ఇంగ్లండ్‌ గెలుపుపై ఆశలు వదులుకున్నప్పటికీ.. రవి బిష్ణోయ్‌ వేసిన ఓ ఓవర్‌ ఆ జట్టును గెలుపు ట్రాక్‌ ఎక్కించింది. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో బిష్ణోయ్‌ ఏకంగా 29 పరుగులు సమర్పించుకొని టీమిండియా కొంపముంచాడు. ఆతర్వాత ఒత్తిడి తగ్గడంతో ఇంగ్లండ్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్‌ వేదికగా జులై 7న జరుగనుంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement