సిరీస్ ఓట‌మి; పాక్‌ జ‌ట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్‌! | Sarfaraz-Ahmed-Sacked-Replace-Mike Hesson-Head-Coach-3rd Test Vs ENG | Sakshi
Sakshi News home page

సిరీస్ ఓట‌మి; పాక్‌ జ‌ట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్‌!

Aug 31 2026 8:09 PM | Updated on Aug 31 2026 8:24 PM

Sarfaraz-Ahmed-Sacked-Replace-Mike Hesson-Head-Coach-3rd Test Vs ENG

Photo Credit: Twitter

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య జ‌ట్టుకు కోల్పోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓట‌మిని చ‌విచూసిన పాకిస్తాన్ రెండో  టెస్టులో 194 ప‌రుగుల తేడాతో దారుణ ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. 

ఈ నేప‌థ్యంలో మూడో టెస్టుకు ముందు జ‌ట్టులో కీల‌క‌మార్పుల‌తో పాటు ప్ర‌ధానంగా రెడ్‌బాల్ కోచ్‌గా ఉన్న స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ప‌ద‌వి ఊస్ట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అత‌డి స్థానంలో వైట్‌బాల్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మైక్ హ‌స‌న్‌కే టెస్టు కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాల‌ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. ఇదే గ‌నుక జ‌రిగితే మైక్ హ‌స‌న్ మూడు ఫార్మాట్ల‌కు హెడ్ కోచ్‌గా ఉండ‌నున్నాడు.

వరుస పరాజయాల నేపథ్యంలో టెస్ట్ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పీసీబీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం లండన్‌లోనే ఉన్న మైక్ హెసన్, ఆకిబ్ జావేద్‌తో కలిసి ప్రిన్స్ చార్లెస్ ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ పర్యటనలోనే ఆయనకు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది.

సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మైక్ హెసన్ పాకిస్తాన్ జట్టుతో కలవనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో టెస్ట్ సమయంలో హెసన్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది సర్ఫరాజ్ అహ్మద్ పదవికి ముగింపు కార్డు పడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ 18న బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌కు ముందు సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. మొదటి అసైన్‌మెంట్‌లోనే బంగ్లాదేశ్ చేతిలో సొంత గడ్డపై వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో 2 టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో మరో వైట్‌వాష్ దిశగా ప్రయాణిస్తుండటంతో పీసీబీ వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ముగిసిన అనంత‌రం ఇమామ్ ఉల్ హ‌క్‌తో పాటు సీనియ‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుప‌య‌న‌మ‌య్యాడు. తాజాగా బాబర్‌ గైర్హాజరీలో మొదటి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్‌ అలీ అఘాను కూడా పీసీబీ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో సల్మాన్‌ అఘా స్వదేశానికి తిరిగి రానున్నాడు.

చదవండి: సచిన్‌ను వెంటాడిన ఫోబియా వైభవ్‌కు అంటుకుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement