IPL 2021: ఆర్సీబీ తదుపరి కెప్టెన్గా జట్టులో ఎవరూ సరిపోరు.. కాబట్టి..
Brad Hogg Comments On Virat Kohli RCB Captaincy Decision: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో మరొకరిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవల ప్రకటించిన కోహ్లి.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగుతానని ఆదివారం ప్రకటించాడు. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానెల్లో ఆర్సీబీ తదుపరి కెప్టెన్ గురించి చర్చించిన హాగ్.. ప్రస్తుత జట్టు నుంచి ఎవరూ కూడా కెప్టెన్సీ బాధ్యతలకు సరిపోరని తెలిపాడు.
"వచ్చే ఏడాది సీజన్కు తమ జట్టుకు నాయకత్వం వహించడానికి ఆర్సీబీ యాజమాన్యం ఒకరిని కొనుగోలు చేయాలి. ప్రస్తుత జట్టులో ఎవరూ కూడా నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటారని నేను అనుకోను. ఏబీ డివిలియర్స్ ఎంతకాలం ఐపీఎల్లో కొనసాగుతాడో మనకు తెలియదు. అతడు స్వల్ప కాలం మాత్రమే ఐపీఎల్లో కొనసాగితే.. కెప్టెన్గా వ్యవహరించే అవకాశం లేకపోవచ్చు’’ అని హాగ్ వెల్లడించాడు. జట్టులో ఎక్కవ కాలం కొనసాగే ఆటగాడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని అతడు అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్లో విజయవంతమైన జట్లను చూస్తే, రోహిత్ శర్మ చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా ఉన్నాడు. కావున వారు చాలా విజయాలు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్కు ధోనీ చాలా ఏళ్లుగా నుంచి సారథిగా ఉన్నాడు. కానీ ఆర్సీబీ టైటిల్ గెలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీలో ఎవరూ కెప్టెన్ పాత్రను పోషించలేరు" అని చెప్పాడు. కాగా వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఏయే ఆటగాళ్లను రీటైన్ చేసుకుంటే బాగుంటుందని ప్రశ్నించినపుడు.. కోహ్లీ, కైల్ జమీసన్, మహ్మద్ సిరాజ్ , దేవదత్ పడిక్కల్ను హాగ్ ఎంపిక చేసుకున్నాడు.
చదవండి: CSK Vs MI: మహి భాయ్ ఉండగా చింత ఎందుకు.. ఇదే నా టాప్ ఇన్నింగ్స్
సంబంధిత వార్తలు