ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జులై 4) జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది.
కాగా, రెండో టీ20లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమిండియా కొంపముంచాడు. ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకున్న దశలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఏకంగా 29 పరుగులిచ్చి మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశాడు. ఆ ఓవర్కు ముందు ఇంగ్లండ్ గెలవాలంటే 4 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. పైగా అప్పటికి క్రీజ్లో ఉన్న జేకబ్ బేతెల్ కూడా పరుగులు చేసుందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతడికి జతగా ఉన్న సామ్ కర్రన్ అప్పుడే క్రీజ్లోకి వచ్చాడు.
ఈ దశలో బంతినందుకున్న బిష్ణోయ్ నో బాల్తో ఓవర్ ప్రారంభించి వరుసగా 6, మరో నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. సమీకరణలు 3 ఓవర్లలో 20 పరుగులకు మారిపోయాయి. దీంతో మరింత ఫ్రీగా ఆడిన బేతెల్ (76 నాటౌట్).. జోఫ్రా ఆర్చర్ (10 నాటౌట్) సహకారంతో మ్యాచ్ను సునాయాసంగా ముగించాడు.
ఈ ఓటమి తర్వాత బిష్ణోయ్పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. టీమిండియా ఓటమికి కారకుడంటూ సోషల్మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారు. ఈ చెత్త స్పెల్ కారణంగా బిష్ణోయ్ వ్యక్తిగతంగానూ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ (29) వేసిన స్పెషలిస్ట్ బౌలర్గా అపఖ్యాతి పాలయ్యాడు.
అంతేకాకుండా, 2020లో న్యూజిలాండ్పై శివమ్ దూబే ఇచ్చిన 34 పరుగులు, 2016లో వెస్టిండీస్పై స్టువర్ట్ బిన్నీ ఇచ్చిన 32 పరుగుల తర్వాత మూడో అత్యంత ఖరీదైన ఓవర్గా వేసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.


