'ధోనికి మీరిచ్చే విలువ ఇదేనా' | Sakshi
Sakshi News home page

'మేము మనుషులమే.. మాకూ మనసుంది'

Published Sat, Oct 10 2020 7:21 PM

Pragyan Ojha Says Strongly Ccondemn Abuses Cricketers On Social Media - Sakshi

ముంబై : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా ధోని, కేదార్‌ జాదవ్‌ ఆటతీరుపై ట్రోల్స్‌ కూడా వచ్చాయి. అయితే కొంతమంది మాత్రం క్రికెటర్ల కుటుంబసభ్యులను టార్గెట్‌ చేసుకొని అసభ్యకరవ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఎంఎస్‌ ధోని కూతురు జీవాపై నీచమైన వ్యాఖ్యలు చేయడం పట్ల జార్ఖండ్‌ ప్రభుత్వం సీరియస్‌ కూడా అయింది. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా.. మ్యాచ్‌ ఓడిపోతే దానికి ఆటగాళ్ల కుటుంబసభ్యులను టార్గెట్‌ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించి దిగ్గజ కెప్టెన్‌ల సరసన నిలిచిన ధోని లాంటి ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ పేర్కొన్నాడు. స్పోర్ట్స్‌ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. (చదవండి : ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’)

'ఇది మనమందరం పరిష్కరించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇది కేవలం క్రీడకు సంబంధించిందో లేక వ్యక్తిగత విషయమో కాదు.. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న విషయం. సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు.. అవతలి వ్యక్తికి అది చదివినప్పుడు చాలా డిస్టర్బ్‌ అవుతాడు. ఆటగాడిని విమర్శించడం వరకు ఓకే కానీ.. కుటుంబసభ్యులను ముడిపెడుతూ వ్యక్తిగత దూషణలు దిగడం తగదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుంది.. పిల్లలు ఉంటారు. నాకు కొడుకు, కూతురు ఉన్నారు.. నా వృత్తి రిత్యా కొంతమంది మహిళలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

ఆటలో ఎంఎస్‌ ధోని ప్రదర్శన గురించి ఎన్ని కామెంట్స్‌ రాసినా పట్టించుకోరు.. ఎందుకంటే అది ఆట.. అందులోనూ ప్రతీ ఆటగాడికి గడ్డుకాలం నడుస్తుంది. దీన్ని సాకుగా తీసుకొని కుటుంబసభ్యుల వరకు వెళ్తే ఎవరు ఊరుకోరు. మేము మనుషులమే.. మాకు మనుసులుంటాయి. ఎదుటివారి గురించి హాస్యాస్పదంగా చెప్పినంత వరకు మంచిగానే ఉంటుంది.. కానీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మీ వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌ వరకు ఉపయోగించండి తప్పులేదు.. ఉదా : ఆటగాళ్లు సరిగా ఆడడం లేదని ట్రోల్‌ చేయడం.. వారి ఆటతీరుపై ఫన్నీ మీమ్స్‌ పెట్టడం లాంటివి ఓకే. (చదవండి : జీవా ధోనికి భద్రత పెంపు)

కానీ ఇదే సోషల్‌ మీడియాను ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని మరీ పిచ్చిరాతలు రాసున్నారు. అభిమానం పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తూ అసభ్యపరుషజాలం ఉపయోగిస్తున్నారు. కరోనా కాలంలో ఇలాంటివి మరీ ఎక్కువైపోయాయి.ఈరోజు ధోని, సచిన్‌ లాంటి వ్యక్తుల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడేందుకు ముందుకు రావడం సిగ్గుగా ఉంది. టీమిండియాలో క్రికెట్‌ బతికున్నంత కాలం వారి పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎప్పటికి వాళ్లు దిగ్గజాలుగాను కనబడుతారు. అలాంటి వ్యక్తులు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు. కానీ ఇదంతా ఒక నాన్‌సెన్స్‌.. ఒక భారతీయుడిగా ఇలాంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ' విరుచుకుపడ్డాడు. కాగా ప్రజ్ఞాన్‌ ఓజా టీమిండియా తరపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు.

Advertisement
Advertisement