
గాలే వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ధీటుగా బదులిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. క్రీజులో కమిండు మెండిస్(37), దనుంజయ డి సిల్వా(17) ఉన్నారు. లంక బ్యాటర్లలో ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
256 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్తో 187 పరుగులు చేసి ఔటయ్యాడు. నిస్సాంక చండీమాల్(54)తో కలిసి రెండో వికెట్కు 157 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఏంజెలో మాథ్యూస్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఔటయ్యి పెవిలియన్కు తిరిగి వెళ్తుండగా బంగ్లా ప్లేయర్లు గార్డ్ హాఫ్ హానర్ ఇచ్చారు. బంగ్లా బౌలర్లలో ఇప్పటివరకు హసన్ మహముద్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, మోమినుల్ హక్ తలా వికెట్ సాధించారు.
షాంటో, రహీం సెంచరీలు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 484/9 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా జట్టు కేవలం 11 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.
బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (350 బంతుల్లో 163; 9 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(279 బంతుల్లో 148; 15 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (123 బంతుల్లో 90; 11 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. మిలన్ రత్ననాయకే, తరిందు రత్ననాయకే తలా 3 వికెట్లు సాధించారు.
చదవండి: ధోని వరల్డ్ రికార్డుపై కన్నేసిన పంత్