
PC: BCCI/IPL.com
ముంబై ఇండియన్స్ మహిళా జట్టు హెడ్కోచ్ పదవికి ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం చార్లెట్ ఎడ్వర్డ్స్ విడ్కోలు పలికింది. ఎడ్వర్డ్స్ ఇటీవలే ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్గా ఎంపికైంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్తో తన ప్రయాణాన్ని ఎడ్వర్డ్స్ ముగించింది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
"చార్లెట్ కోచింగ్లో ముంబై ఇండియన్స్ ఎన్నో అద్బుతమైన విజయాలను సాధించింది. కేవలం మూడు సీజన్లలోనే రెండు టైటిల్స్ను అందించిన ఘనత ఆమె సొంతం. ఎంతో యువ క్రికెటర్లకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మాకు రెండు టైటిల్స్ను అందించినందుకు ధన్యవాదాలు.
ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్గా మీ సరికొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు" అంటూ ఎంఐ అధికారిక ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా చార్లెట్ డబ్ల్యూపీఎల్ తొట్టతొలి సీజన్లోనే ముంబై ఇండియన్స్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టనుంది. మొదటి సీజన్లోనే తన అనుభవంతో ముంబైను ఛాంపియన్స్గా చార్లెట్ నిలిపింది. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్-2025 టైటిల్ను కూడా చార్లెట్ నేతృత్వంలోనే ముంబై సొంతం చేసుకుంది.
చార్లెట్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. ఇంగ్లండ్ ఉమెన్స్ క్రికెట్ సూపర్ లీగ్లో సదర్ వైపర్స్ జట్టుకు ఎడ్వర్డ్స్ హెడ్కోచ్గా ఐదు టైటిల్స్ను అందించింది. అదేవిధంగా ది హండ్రెడ్ లీగ్లో సదరన్ బ్రేవ్ను కూడా ఓ సారి ఛాంపియన్గా నిలిపింది. ఇప్పుడు ఇంగ్లండ్ హెడ్ కోచ్ కొత్త పాత్ర స్వీకరించేందుకు ఆమె సిద్దమైంది.
జాన్ లూయిస్ స్ధానాన్ని చార్లెట్ భర్తీ చేయనుంది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు గత కొంతకాలంగా దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. టీ20 ప్రపంచకప్-2023 తర్వాత ఇంగ్లండ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ఈసీబీ కోచింగ్ బాధ్యతలను చార్లెట్కు అప్పగించింది.
చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్