IPL 2025: ముంబై ఇండియ‌న్స్‌లోకి శ్రీలంక కెప్టెన్‌..! | Mumbai Indians eye Charith Asalanka as replacement for IPL 2025: Reports | Sakshi
Sakshi News home page

IPL 2025: ముంబై ఇండియ‌న్స్‌లోకి శ్రీలంక కెప్టెన్‌..!

May 15 2025 7:02 PM | Updated on May 15 2025 7:57 PM

Mumbai Indians eye Charith Asalanka as replacement for IPL 2025: Reports

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025 రీ షెడ్యూల్ కార‌ణంగా దారుణంగా నష్ట‌పోతున్న ఫ్రాంచైజీలలో ముంబై ఇండియ‌న్స్ ఒక‌టి. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల కార‌ణంగా ఆర్ధ‌రంత‌రంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే చాలా మంది విదేశీ ఆట‌గాళ్లు జాతీయ విధుల కార‌ణంగా ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం కానున్నారు.

ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు  ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్ సేవ‌ల‌ను కోల్పోయే అవ‌కాశ‌ముంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసిన‌ దక్షిణాఫ్రికా జట్టులో బాష్, రికెల్ట‌న్ భాగంగా ఉన్నారు. బాష్‌, రికెల్ట‌న్‌ ఒక‌వేళ ఐపీఎల్‌లో పాల్గోనేందుకు తిరిగి భార‌త్‌కు వ‌చ్చినా, ప్లే ఆఫ్స్‌కు మాత్రం క‌చ్చితంగా దూరంగా ఉండ‌నున్నారు.

ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌తో బీసీసీఐ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ప్ప‌టికి.. స‌ద‌రు క్రికెట్ బోర్డు త‌మ ఆట‌గాళ్లు లీగ్ పూర్తి అయ్యేంత‌వ‌ర‌కు ఉండేందుకు అనుమతి ఇవ్వ‌లేదు. మ‌రోవైపు వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో జాక్స్ సభ్యునిగా ఉన్నాడు. అత‌డు కూడా భార‌త్‌కు తిరిగి వ‌చ్చినా ప్లే ఆఫ్స్‌కు మాత్రం దూరంగా ఉండ‌నున్నాడు.

ముంబై జట్టులోకి శ్రీలంక కెప్టెన్‌..?
ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం శ్రీలంక కెప్టెన్ చ‌రిత్ అస‌లంక‌పై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు చరిత్ అసలంకాతో ముంబై చర్చలు జ‌రుపుతున్న‌ట్లు శ్రీలంక వార్తా సంస్థ న్యూస్ వైర్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. అసలంక‌కు టీ20ల్లో అద్బుత‌మైన రికార్డు ఉంది. అత‌డికి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే స‌త్తా ఉంది. 

అంత‌ర్జాతీయ టీ20ల్లో చరిత్‌కు 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే అత‌డితో ఒప్పందం కుద‌ర్చుకునేందుకు ముంబై ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా ఐపీఎల్ రీ షెడ్యూల్ కార‌ణంగా ఈ సీజ‌న్‌లో ఆట‌గాళ్ల‌ తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ముంబై ఇండియ‌న్స్‌కు ఈ ఏడాది సీజ‌న్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ సేన‌ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధిస్తోంది.
చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బ‌ట్ల‌ర్‌.. గుజ‌రాత్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు?
 

Advertisement
 
Advertisement
Advertisement