
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా భారత ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా ఎంచుకున్నాడు.
తన ప్లేయింగ్ ఎలెవన్లో దాస్గుప్తా ముగ్గురు ఫ్రంట్లైన్ పేసర్లు,ఇద్దరు స్పిన్నర్లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్తో టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్న యువ ఆటగాడు సాయిసుదర్శన్కు మాత్రం దాస్ గుప్తా తన ఎంచుకున్న జట్టులో చోటు ఇవ్వలేదు.
అతడి స్ధానంలో వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ వైపు ఈ మాజీ క్రికెటర్ మొగ్గు చూపాడు. సాయిసుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నప్పటికి, అనుభవాన్ని పరిగణలోకి తీసకుని కరుణ్కు అవకాశమివ్వాలని దీప్ దాస్ గుప్తా సూచించాడు. కాగా నాయర్ దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక దీప్దాస్ గుప్తా ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కింది. అదేవిధంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా శార్ధూల్ ఠాకూర్ బదులుగా నితీష్ కుమార్ రెడ్డిని దాస్గుప్త ఎంచుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలకు అవకాశమిచ్చాడు.
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు దాస్ గుప్తా ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్
యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ
చదవండి: ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్