
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2027-29 సైకిల్లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లను నిర్వహించేందుకు ఐసీసీ సిద్దమైంది. చిన్న దేశాలకు చెందిన క్రికెట్ జట్లు ఎక్కువ టెస్టులు ఆడటానికి, నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది గార్డియన్ తమ రిపోర్ట్లో పేర్కొంది.
అయితే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్లకు ఆ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత వారం లార్డ్స్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ-2025 ఫైనల్ సమయంలో ఈ విషయంపై ఐసీసీ చైర్మెన్ జై షా చర్చలు జరిపినట్లు సమాచారం. తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో నాలుగు రోజుల మ్యాచ్ను ప్రవేశపెట్టేందుకు జైషా తన మద్దతు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా 2017లోనే ద్వైపాక్షికంగా నిర్వహించే సిరీస్లకు నాలుగు రోజుల టెస్టుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. గత నెలలో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, జింబాబ్వే మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. అంతకుముందు 2019, 2023లో ఐర్లాండ్తోనూ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ తలపడింది.
ఇక 2025–27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మంగళవారం(జూన్ 17) నుంచి ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. అయితే ప్రస్తుత సైకిల్ను 5 రోజుల ఫార్మాట్లోనే ముగించనున్నారు. 2025-27 సైకిల్లో మొత్తంగా 27 టెస్టు మ్యాచ్ సిరీస్లు జరగనున్నాయి.
ఇందులో 17 సిరీస్లు రెండేసి మ్యాచ్లు చొప్పున జరగనున్నాయి. ఓవరాల్గా 9 దేశాల క్రికెట్ జట్లు తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ప్రస్తుత సైకిల్లో ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా జట్లు ఒకదానితో ఒకటి ఐదు టెస్ట్ సిరీస్లు ఆడనున్నాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్గా టీమిండియా స్టార్ ఓపెనర్