ధోనితో వాదించిన రుతురాజ్‌.. ఎవరి ఆదేశాలు పాటించాలి? | 'I've to Look At Dhoni, Ruturaj For Instructions': Chahar On CSK's Captaincy Change - Sakshi
Sakshi News home page

#MSDhoni: ఆదేశాల కోసం ఎవరిని చూడాలో అర్థం కావడం లేదు: CSK స్టార్‌

Published Wed, Mar 27 2024 11:21 AM

Ive to Look At Dhoni Ruturaj For instructions Confusion: Chahar on CSK Captaincy Change - Sakshi

'I've to look at both Dhoni and Ruturaj for instructions: గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చహర్‌. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా(21), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(8) రూపంలో రెండు కీలక వికెట్లు తీసి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చెపాక్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 28 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌తో  మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సీఎస్‌కే అదరగొట్టిన విషయం తెలిసిందే.

సొంత మైదానంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ను 143 పరుగులకే కట్టడి చేసి.. 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

ఈ నేపథ్యంలో విజయానంతరం దీపక్‌ చహర్‌ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ నుంచి చహర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘బౌలింగ్‌ చేసేటపుడు నువ్వు ధోనితో చర్చిస్తావా? లేదంటే గైక్వాడ్‌తోనా? ఆదేశాల కోసం ఎవరివైపు చూస్తావు?’ అని గావస్కర్‌ అడిగాడు.

ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదు
ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఇప్పుడు మహీ భాయ్‌, రుతురాజ్‌.. ఇద్దరి వైపూ చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి మహీ భాయ్‌ను చూడాలా లేదంటే రుతురాజ్‌ను చూడాలా అన్నది అర్థం కావడం లేదు. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌ అయితే ఉంది.

ఏదేమైనా రుతురాజ్‌ తనదైన శైలిలో సమర్థవంతంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని దీపక్‌ చహర్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024 ఆరంభానికి ఒక్కరోజు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోని.. పగ్గాలను రుతురాజ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్‌ సెట్‌ చేసే విషయంలో మాత్రం ధోని జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు.

కొత్త నిబంధనలు మాకే ఉపయోగకరం
ఈ క్రమంలో గుజరాత్‌తో మ్యాచ్లో రుతురాజ్‌ ధోనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్‌కేకు ఆడుతున్న తొలినాళ్ల నుంచే పవర్‌ ప్లేలో నేను మూడు ఓవర్లు బౌల్‌ చేస్తున్నా. కొత్త నిబంధనలకు అనుగుణంగానే నా ఆట తీరులో మార్పు చేసుకుంటున్నా.

గతంలో ఆరంభ ఓవర్‌లోనే 2-3 బౌన్సర్లు వేస్తే.. ఆ తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఒక ఓవర్‌లో కేవలం రెండు బౌన్సర్లకే అనుమతినిచ్చారు.

పేసర్లకు ఈ రూల్‌ అనుకూలంగా ఉంది. పెద్దగా తేమ లేని వికెట్‌పై బంతిపై గ్రిప్‌ సాధించేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని చహర్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఈ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ధ శతకం(23 బంతుల్లో 51)తో చెలరేగిన సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ శివం దూబే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: #Rohit Sharma: రోహిత్‌ శర్మ ఫ్లైయింగ్‌ కిస్‌.. ఫొటోలు డిలీట్‌ చేసిన సన్‌రైజర్స్‌

Advertisement
Advertisement