
ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్న వేల పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. యూరోపియన్ టీ10 లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో ఇటలీకి చెందిన జైన్ నఖ్వీ కేవలం 26 బంతుల్లోనే శతకొట్టాడు. పొట్టి క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉండేది. సాహిల్ 2024లో సైప్రస్తో జరిగిన టీ20 మ్యాచ్లో 27 బంతుల్లో సెంచరీ చేశాడు.
సాహిల్ తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాళ్లు ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ పేరిట సంయుక్తంగా ఉంది. ఉర్విల్, అభిషేక్ తలో 28 బంతుల్లో (టీ20ల్లో) సెంచరీలు చేశారు. వీరి తర్వాత అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడుతూ పూణే వారియర్స్పై 30 బంతుల్లో శతక్కొట్టాడు.
టాప్-10 ఫాస్టెస్ట్ సెంచరీలు..
జైన్ నఖ్వీ- 26 బంతుల్లో
సాహిల్ చౌహాన్- 27
ఉర్విల్ పటేల్- 28
అభిషేక్ శర్మ- 28
క్రిస్ గేల్- 30
రిషబ్ పంత్- 32
లుబ్బే- 33
నికోల్ లాఫ్టన్- 33
సికందర్ రజా- 33
ఆండ్రూ సైమండ్స్- 34
నమ్మశక్యంకాని స్ట్రైక్రేట్తో..
నఖ్వీ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. ఈ ఇన్నింగ్స్లో అతను మొత్తం 37 బంతులు ఎదుర్కొని నమ్మశక్యంకాని 432.43 స్ట్రైక్ రేట్తో 24 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. నఖ్వీ ఇన్నింగ్స్లో మరో విశేషమేమిటంటే.. రెండు సార్లు ఒకే ఓవర్లో అతను వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్, హజ్రతుల్లా జజాయ్, కీరన్ పోలార్డ్, తిసారా పెరీరా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వారిలో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. యూరోపియన్ టీ10లో లీగ్లో భాగంగా టీమ్ సివిడేట్, మార్ఖోర్ మిలానో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 23 ఏళ్ల జైన్ నఖ్వీ మార్ఖోర్ మిలానో తరఫున ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మార్ఖోర్ మిలానో.. జైన్ నఖ్వీ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడటంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మార్ఖోర్ మిలానో ఇన్నింగ్స్లో జైన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సివిడేట్ జట్టు 9 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై 104 పరుగుల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సివిడేట్ తరపున షాబాజ్ మసూద్ అత్యధికంగా 34 పరుగులు చేశాడు.
నఖ్వీ కెరీర్ ఇలా..
జైన్ నఖ్వీ అంతర్జాతీయ క్రికెట్లో ఇటలీ తరఫున ఆడుతున్నాడు. అతను ఇప్పటివరకు 4 టీ20 మ్యాచ్లు ఆడి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.