
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ జట్టుకు అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. ఏ జట్టు అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించలేదు. ఈ రేసులో ఆర్సీబీ అన్ని జట్ల కంటే కాస్త ముందుంది.
ఆ జట్టు ఇప్పటివరకు (ఏప్రిల్ 29) ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. పేరుకు ఆర్సీబీ టేబుల్ టాపర్గా ఉన్నా.. ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం మిగిలిన తొమ్మిది జట్లతో పోటీపడాల్సిందే.
ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ సహా మరో ఆరు జట్లు ముందు వరుసలో ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ముంబై ఇండియన్స్ ఆతర్వాత అనూహ్య విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 10 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి, ఆర్సీబీ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలో 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ పదింట ఆరు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.
ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఈ నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు కూడా ప్రధానంగా పోటీపడుతున్నాయి. పంజాబ్ ఆడిన 9 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కేకేఆర్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పంజాబ్కు ఓ పాయింట్ (మరో పాయింట్ కేకేఆర్కు) లభించింది. ప్లే ఆఫ్స్ రేసులో చివరికి ఈ ఒక్క పాయింట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.
పై ఏడు జట్లతో పాటు ప్లే ఆఫ్స్ రేసులో ప్రధానంగా ఉన్న మరో రెండు జట్లు లక్నో, కేకేఆర్. లక్నో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. లక్నో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే రన్రేట్ను భారీగా మెరుగుపర్చుకోవాలి. ప్రస్తుతం పోటీలో ఉన్న ఏడు జట్లలో ఈ ఒక్క జట్టు రన్రేట్ మాత్రమే మైనస్లో (-0.325) ఉంది.
నిన్న ఢిల్లీపై అనూహ్య విజయంతో కేకేఆర్ కూడా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్తో మ్యాచ్ రద్దు కావడంతో లభించిన పాయింట్తో కేకేఆర్ పాయింట్ల సంఖ్య 9కి చేరింది.
ప్రస్తుతానికి పైన పేర్కొన్న ఏడు జట్ల మధ్య నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం ప్రధానంగా పోటీ జరుగుతుంది. అయితే పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, సన్రైజర్స్, సీఎస్కే అవకాశాలను కూడా కొట్టి పారేయడానికి వీల్లేదు.
రాజస్థాన్ తాజాగా గుజరాత్ టైటాన్స్పై సంచలన విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో (6 పాయింట్లు) ఉంది.
ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న మరో జట్టు సన్రైజర్స్. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. రాజస్థాన్తో పోలిస్తే సన్రైజర్స్కు ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు రాజస్థాన్ 10 మ్యాచ్లు ఆడగా.. సన్రైజర్స్ తొమ్మిదే ఆడింది.
ఈ సీజన్లో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించకపోయినా , ఏ మాత్రం అవకాశం లేని ఏకైక జట్టు సీఎస్కే . సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 5 మ్యాచ్ల్లో గెలిచినా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో ఉండదు.