MI VS PBKS: రోహిత్‌ శర్మను ఊరిస్తున్న రెండు భారీ రికార్డులు | IPL 2025, MI VS PBKS: Rohit Sharma In Verge Of Breaking Two Huge IPL Records | Sakshi
Sakshi News home page

MI VS PBKS: రోహిత్‌ శర్మను ఊరిస్తున్న రెండు భారీ రికార్డులు

May 26 2025 4:30 PM | Updated on May 26 2025 5:02 PM

IPL 2025, MI VS PBKS: Rohit Sharma In Verge Of Breaking Two Huge IPL Records

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా జైపూర్‌ వేదికగా ఇవాళ (మే 26) జరుగనున్న కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు ఈ మ్యాచ్‌ ఫలితం ఇరు జట్లకు చాలా కీలకమవుతుంది. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ గెలిస్తే 19 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌కు చేరుతుంది. ముంబై గెలిచినా (గుజరాత్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉండటం చేత) 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్‌-1లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు క్వాలిఫయర్‌-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.

పాయింట్ల పట్టికలో టాప్‌-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..
గుజరాత్‌- 18 (0.254)
పం‍జాబ్‌- 17 (0.327)
ఆర్సీబీ- 17 (0.255)
ముంబై- 16 (1.292)

మూడు సిక్సర్ల దూరంలో..!
ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ రెండు భారీ రికార్డులపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మూడు సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 300 సిక్సర్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో క్రిస్‌ గేల్‌ ఒక్కడే ఇప్పటివరకు 300 సిక్సర్ల మైలురాయిని తాకాడు. రోహిత్‌ తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకేందుకు విరాట్‌ కోహ్లికి అవకాశముంది. విరాట్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 291 సిక్సర్లు బాదాడు.

మరో 67 పరుగులు చేస్తే..!
నేటి మ్యాచ్‌లో రోహిత్‌ మరో 67 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో అత్యంత అరుదైన 7000 పరుగుల మార్కును తాకుతాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో విరాట్‌ కోహ్లి మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించాడు. విరాట్‌ ఖాతాలో 8552 పరుగులు ఉండగా.. రోహిత్‌ ఖాతాలో 6933 పరుగులు ఉన్నాయి. విరాట్‌, రోహిత్‌ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా శిఖర్‌ ధవన్‌ (6769), డేవిడ్‌ వార్నర్‌ (6565), సురేశ్‌ రైనా (5528) ఉన్నారు.

వార్నర్‌, విరాట్‌ తర్వాత..!
నేటి మ్యాచ్‌లో రోహిత్‌ 47 పరుగులు చేస్తే పంజాబ్‌ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరతాడు. పంజాబ్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్‌-2 బ్యాటర్లుగా డేవిడ్‌ వార్నర్‌ (1134), విరాట్‌ కోహ్లి (1104) చలామణి అవుతున్నారు.

నేటి మ్యాచ్‌లో తుది జట్లు (అంచనా)..
పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబే

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

 

Advertisement
 
Advertisement
Advertisement