
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ముంబై ఇంటికి, పంజాబ్ ప్లే ఆఫ్స్కు చేరాయి. జూన్ 3న జరుగనున్న ఫైనల్లో పంజాబ్.. ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.
కాగా, ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఈ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్లోని సభ్యులందరికీ కూడా 50 శాతం (రూ. 12 లక్షలు) మ్యాచ్ ఫీజ్ జరిమానాగా పడింది.
ఈ సీజన్లో రూల్స్ మారడంతో హార్దిక్ సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ సీజన్కు ముందు వరకు ఓ సీజన్లో మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించేవారు.
ఇదే మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కూడా జరిమానా పడింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడంతో రూ.24 లక్షల ఫైన్ విధించారు. పంజాబ్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధిస్తారు) కోత విధించారు.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు.
అజ్మ తుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు.