
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు బౌలర్లు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత-ఎ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ లయన్స్ 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
క్రీజులో జోర్డాన్ కాక్స్(31),జేమ్స్ రెవ్(0) ఉన్నారు. టాపర్డర్ బ్యాటర్లు టామ్ హైన్స్(54), ఎమిలియో గే(71) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఇంకా 127 పరుగులు వెనకబడి ఉంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు కాంబోజ్, కోటియన్, దేశ్పాండే తలా వికెట్ సాధించారు.
ఇక అంతకుముందు భారత్-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముగించింది. భారత్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్(116) టాప్ స్కోరర్గా నిలవగా..ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించారు.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
చదవండి: ఆర్సీబీలోకి బుమ్రా, సూర్యకుమార్, పంత్: విజయ్ మాల్యా డ్రీమ్ టీమ్