KL Rahul: అతడిని ఏ ప్రాతిపదికన వైస్‌ కెప్టెన్‌ చేశారో తెలీదు.. అయితే పంత్‌ మాత్రం..

Ind Vs Ban: KL Rahul On Pujara As Vice Captain Do Not Know Criteria - Sakshi

India Vs Bangladesh Test Series 2022: ‘‘ఏ ప్రాతిపదికన అతడికి ఈ బాధ్యతలు అప్పజెప్పారో తెలియదు. జట్టులోకి ఎవరిని తీసుకున్నా వారికి అండగా నిలబడాల్సి ఉంటుంది. నేను కూడా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైనపుడు సంతోషపడ్డాను. అదే సమయంలో జట్టు పట్ల నా బాధ్యత కూడా మరింత పెరిగింది’’ అని టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టుకు రాహుల్‌ సారథిగా ఎంపికయ్యాడు. రోహిత్‌తో పాటు మరికొందరు ఆటగాళ్ల గాయపడిన నేపథ్యంలో వాళ్ల స్థానాలను భర్తీ చేసిన మేనేజ్‌మెంట్‌.. రిషభ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా తప్పించింది.

ఎందుకిలా?
అతడి స్థానంలో నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారాను రాహుల్‌కు డిప్యూటీగా నియమించింది. ఈ నిర్ణంయపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంత్‌ ఫ్యాన్స్‌ బీసీసీఐని ట్రోల్‌ చేశారు. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పెద్దగా రాణించకపోయినా అవకాశాలు ఇచ్చారు గానీ.. అసలైన మ్యాచ్‌లో పంత్‌ను వైస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం ఏమిటి? భవిష్యత్తులో కెప్టెన్‌ కావాల్సిన అన్ని లక్షణాలు తనకు ఉన్నాయి కదా!’’ అంటూ కామెంట్లు చేశారు.

నాకైతే తెలియదు
ఇక మ్యాచ్‌కు ముందు ప్రెస్‌మీట్‌లో రాహుల్‌ మాట్లాడుతున్న సమయంలో ఈ విషయమై అతడికి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర, ప్రాధాన్యం ఏమిటో తెలుసనని వ్యాఖ్యానించాడు. అయితే, పుజీని వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక ఎలా జరిగిందో మాత్రం తనకు తెలియదన్నాడు. ఏదేమైనా జట్టులో పంత్‌, పుజారా కీలక సభ్యులేనని పేర్కొన్నాడు.

‘‘రిషభ్‌, పుజీ.. టెస్టు క్రికెట్‌లో అద్భుత ఆటగాళ్లు. చాలా ఏళ్లుగా జట్టుకు ఆడుతూ.. టీమ్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఎవరికి వారే సాటి. కాబట్టి ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైస్‌ కెప్టెన్‌ ఎవరైనా వాళ్ల బాధ్యత ఇంకాస్త పెరుగుతుందే గానీ.. వేరే మార్పులేమీ ఉండవు.

పదకొండు మంది ఆటగాళ్లు సమిష్టిగా ఆడితేనే జట్టు గెలుస్తుంది’’అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. కాగా పంత్‌ గత కొంతకాలంగా టెస్టుల్లో రాణిస్తుండగా.. పుజారా మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే, ఇటీవల బంగ్లా- ఎ జట్టుతో సిరీస్‌లో పుజీ ఫర్వాలేదనిపించాడు. ఇదిలా ఉంటే.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14న తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. 

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌- భారత జట్టు ఇదే
శుబ్‌మన్‌ గిల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సౌరభ్‌ కుమార్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శ్రీకర్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైనీ.

చదవండి: Ranji Trophy: రంజీ ట్రోఫీ.. టోర్నీ పుట్టుక వెనుక చరిత్ర ఇదే
Babar Azam: అంటే మేం టెస్టులు ఆడటం ఆపేయాలా?: పాక్‌ కెప్టెన్‌ అసహనం
Ind Vs Ban: పాక్ అవుట్‌.. మరి టీమిండియా? ఫైనల్‌ రేసులో నిలవాలంటే అదొక్కటే దారి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top