'అత‌డు 20 ఓవ‌ర్లు ఆడితే ఛాంపియ‌న్స్ ట్రోఫీ భార‌త్‌దే' | If Rohit Sharma plays for 20 overs, well win 100: Aakash Chopra | Sakshi
Sakshi News home page

Champions Trophy final: 'అత‌డు 20 ఓవ‌ర్లు ఆడితే ఛాంపియ‌న్స్ ట్రోఫీ భార‌త్‌దే'

Mar 9 2025 9:27 AM | Updated on Mar 9 2025 10:12 AM

If Rohit Sharma plays for 20 overs, well win 100: Aakash Chopra

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఊవ్విళ్లరూతోంది.

ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును ఫైనల్లో కూడా కొనసాగించాలని తహతహలాడుతోంది. మరోవైపు కివీస్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది.

ఆ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2021 ఫైనల్లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడానికి భారత్‌కు ఇదే సరైన అవకాశం. ఇక టైటిల్ పోరు నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌​ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.

"రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్‌. మైదానంలో వ్యూహాలు రచించడంలో రోహిత్‌​ దిట్ట. గ‌త మూడు ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఫైన‌ల్ పోరులో భార‌త్ విజ‌యం సాధిస్తే రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌ ఖాతాలో నాలుగు ఐసీసీ ట్రోఫీలు చేరుతాయి.

ఈ ఫీట్ సాధించిన తొలి భార‌త క్రికెట‌ర్ల‌గా వారిద్ద‌రూ నిలుస్తారు. రోహిత్ శ‌ర్మ ఎల్ల‌ప్పుడూ దూకుడుగానే ఆడుతాడు. ప‌వ‌ర్‌ప్లేలో ప‌రుగులు రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో కాస్త ఎక్కువ సేపు అత‌డు ఆడితే బాగుంటుంది. రోహిత్ 20 ఓవ‌ర్లు ఆడితే భార‌త్‌దే ఛాంపియ‌న్స్ ట్రోఫీ అని"చోప్రా త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.

కాగా రోహిత్‌ శర్మ ఈ మెగా టోర్నీలో పర్వాలేదన్పిస్తున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తన లభించిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లగా రోహిత్‌ మలచలేకపోతున్నాడు.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్‌, మహ్మద్‌ షమీ, కుల్దీప్, వరుణ్‌.  

న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.
చదవండి: Champions Trophy final: 'వ‌రుణ్ కాదు.. అత‌డితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'

 

Advertisement
 
Advertisement
Advertisement