నెలకు రూ. 25 వేలు | Hockey players to get Rs 25,000 per month pocket allowance | Sakshi
Sakshi News home page

నెలకు రూ. 25 వేలు

Jun 21 2025 6:31 AM | Updated on Jun 21 2025 6:31 AM

Hockey players to get Rs 25,000 per month pocket allowance

హాకీ ప్లేయర్లకు భత్యం ఇవ్వనున్న కేంద్ర క్రీడా శాఖ

పురుషులు, మహిళలు కలిపి 80 మంది క్రీడాకారులకు లబ్ది

న్యూఢిల్లీ: భారత హాకీ ప్లేయర్లకు నెలవారీ భత్యం ఇచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే ప్లేయర్లకు నజరానాలు అందుతుండగా... ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం తరఫున ప్రతి నెల ఒక్కో ప్లేయర్‌కు రూ. 25 వేలు భత్యంగా ఇవ్వాలని క్రీడా శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై చాన్నాళ్లుగా చర్చలు జరుగుతుండగా... హాకీ ఇండియా ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. 

జాతీయ శిబిరాలకు ఎంపికయ్యే పురుష, మహిళా ప్లేయర్లకు ఈ భత్యం అందించనున్నట్లు వెల్లడించింది. ‘ఆటగాళ్లకు నెలవారీ ప్రోత్సహకంగా భత్యం రూపంలో అందించాలని హాకీ ఇండియా చాలా రోజులుగా కోరుతోంది. వారి డిమాండ్‌కు అంగీకారం తెలిపాం. ప్రతిభ గల ఆటగాళ్లకు అండగా నిలిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అన్నారు.  

→ పురుషుల విభాగంలో 40 మంది ఆటగాళ్లు, మహిళల విభాగంలో 40 మంది ప్లేయర్లకు ఈ భత్యాలు అందించనుంది.  
→ టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో భాగంగా గురువారం నిర్వహించిన ‘మిషన్‌ ఒలింపిక్‌ కమిటీ’లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
→ కోర్‌ గ్రూప్‌ ప్లేయర్లకు రూ. 50 వేల చొప్పున దక్కనున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి నెలకు రూ. 20 లక్షలు ఖర్చు కానున్నాయి.  
→ హాకీ ఇండియా ప్రతి నెలా ప్లేయర్ల జాబితాను క్రీడాశాఖకు పంపనుంది. ఫిట్‌నెస్, ఫామ్‌ ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.  
→ ప్రస్తుతం హాకీ ఆటగాళ్లు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న విభాగాలు, సంస్థలు, బోర్డుల నుంచి జీతాలు పొందుతున్నారు. వీటికి అదనంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన సమయంలో లభించే ప్రైజ్‌మనీని పంచుకుంటున్నారు. 
→ భారత పురుషుల హాకీ జట్టు గత కొంతకాలంలో ఎంతో మెరుగైంది. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో వరుసగా కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన మహిళల జట్టు... పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.  
→ ప్రస్తుతం భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ యూరోప్‌ అంచె పోటీల్లో పాల్గొంటున్నాయి. అయితే కఠిన పరిస్థితుల్లో ఇరు జట్లు విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నాయి.  
→ ‘టాప్స్‌’లో భాగంగా హాకీ ఆటగాళ్లకే కాకుండా ఇతర క్రీడలకు చెందిన ప్లేయర్లకు సైతం క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా నిధులు విడుదల చేసింది.  
→ టెన్నిస్‌ ఆటగాళ్లు సాకేత్‌ మైనేని, జీవన్‌ నెడుంజెళియాన్‌తో పాటు మరో ముగ్గురు మహిళా ప్లేయర్లకు కలిపి రూ. 1.38 కోట్లు వేర్వేరు కారణాల కోసం విడుదల చేసింది. మొత్తంగా ఈ భేటీలో అథ్లెట్ల కోసం మొత్తం రూ. 4.28 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో పలువురు పారా అథ్లెట్లు కూడా ఉన్నారు. 
→ ప్రతిభకు పట్టం కట్టే విధానంలో సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయించింది. గ్రామీణ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిన అథ్లెట్లను ఖేలో ఇండియా రీజనల్‌ సెంటర్‌లలో అవకాశం కలి్పంచి వారి మెరుగుదలను నమోదు చేయాలని నిర్ణయించింది. వయో విభాగాలను బట్టి ప్రతిభావంతులకు మరింత ప్రోత్సాహం అందించనుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement