మహిళే మహారాణి | Increasing Female Employment in India | Sakshi
Sakshi News home page

మహిళే మహారాణి

Apr 29 2026 2:36 AM | Updated on Apr 29 2026 2:36 AM

Increasing Female Employment in India

పెరుగుతున్న అవకాశాలు

39 శాతానికి చేరిన ఉపాధి రేటు

కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

న్యూఢిల్లీ: మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర కార్మీక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఉపాధి కల్పన రేటు 2017లో ఉన్న 22 శాతం నుంచి 2025లో 39 శాతానికి పెరిగినట్టు చెప్పారు. మహిళా కార్మీకుల భాగస్వామ్య రేటు 2017–18లో 23.3 శాతంగా ఉంటే, 2025లో 40 శాతానికి చేరినట్టు వెల్లడించారు.

మహిళల నిరుద్యోగ రేటు ఇదే కాలంలో 5.6 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గిందని.. ఉపాధి కోరుకుంటున్న మహిళలు నేడు ఆ దిశగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలూ భాగస్వాములు కావడం అత్యావశ్యకమే కాకుండా.. ఆర్థికంగానూ తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మహిళా సాధికారతను కేంద్రబిందువుగా పేర్కొన్నారు. 

మెరుగైన సామాజిక భద్రత 
సామాజిక భద్రత కవరేజీ గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు మంత్రి మాండవీయ తెలిపారు. 2015లో ఉన్న 19 శాతం నుంచి 2025లో 64.3 శాతానికి చేరినట్టు చెప్పారు. కార్మీక సంస్కరణలు, డిజిటల్‌ సేవలు, లకిష్యత సంక్షేమ ఫలాల బదిలీ కోసం చేపట్టిన స్థిరమైన విధానాలు ఇందుకు దోహదం చేసినట్టు తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫామ్‌ కార్మీకులను అధికారికంగా గుర్తిస్తూ 2020లో కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ (సీవోఎస్‌ఎస్‌)ను ప్రవేశపెట్టినట్టు మంత్రి మాండవీయ గుర్తు చేశారు.

వీరిలో ఇప్పుడు చాలా మంది మహిళలు ఉన్నారని.. వారికి చట్టపరమైన గుర్తింపుతోపాటు సామాజిక భద్రత ఏర్పడినట్టు చెప్పారు. మహిళా డెలివరీ కార్మీకులు వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడమే కాకుండా, సామాజిక పురోగతికి పాటుపడుతున్నట్టు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోనే స్విగ్గీ ఫుడ్, ఇన్‌స్టామార్ట్‌ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన మహిళా డెలివరీ పార్ట్‌నర్‌లను మంత్రి సన్మానించారు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో శ్రీహర్ష మాజేటి, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement