
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గోవా తరఫున బ్రిసన్ డ్యూబెన్ ఫెర్నాండెజ్ 29వ నిమిషంలో గోల్ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్రింగ్ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్ గోల్ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది.
54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్ కేపీ రాహుల్ గోల్ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్పోస్ట్వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్తో విజయవంతమైంది.
ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్పోస్ట్పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్లో జరిగే పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడుతుంది.