
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ జట్టు కేవలం రెండు పరుగులకు ఆలౌటైంది. ఈ వింత రికార్డుకు ఇంగ్లండ్ మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ వేదికైంది. ఈ లీగ్ మూడో టైర్ డివిజన్లో భాగంగా సోమవారం నార్త్ లండన్ సీసీ 3rd XI, రిచ్మండ్ సీసీ 4th XI జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 426 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. నార్త్ లండన్ బ్యాటర్ డాన్ సిమ్మన్స్(140) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం 427 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రిచ్మండ్ సీసీకి ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి.

నార్త్ లండన్ సీసీ బౌలర్ల ధాటికి రిచ్మండ్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో రిచ్మండ్ 5.4 ఓవర్లలో కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు పరుగుల స్కోర్లో ఓ వైడ్ కూడా ఉండడం గమనార్హం. రిచ్మండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 9 మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్కు సంబంధించిన స్కోర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నార్త్ లండన్ బౌలర్లలో మాథ్యూ రాన్సన్ 5 వికెట్లతో ప్రత్యర్ది పతనాన్ని శాసించగా..థామస్ పాటన్ 3 వికెట్లు పడగొట్టారు. లాస్ట్ బ్యాటర్ విక్రమ్ మంగళూరు బ్యాటింగ్ కు రాలేదు. రిచ్మండ్ 2 పరుగులే చేయడంతో నార్త్ లండన్ 424 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్ కిందకు రానుందన ఈ చెత్త రికార్డును పరిగణలోకి తీసుకోలేదు.
ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరు సాధించిన రికార్డు ది బిఎస్ జట్టు పేరు మీద ఉంది. 1810లో లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ది బిస్ కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఈ చెత్త రికార్డు న్యూజిలాండ్ జట్టు పేరిట ఉంది. 1955లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు కేవలం 26 పరుగులకే ఆలౌటైంది.