
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో దిండిగల్ డ్రాగన్స్కు సారథ్యం వహిస్తున్న అశ్విన్.. బాల్ ట్యాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అశ్విన్ బంతి స్వరూపాన్ని మర్చేందుకు ప్రయత్నించాడని మధురై పాంథర్స్ జట్టు ఫిర్యాదు చేసింది.
టీఎన్పీఎల్ 2025 సీజన్లో భాగంగా జూన్ 14న దిండిగల్ డ్రాగన్స్, మధురై పాంథర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మధురైను 9 వికెట్ల తేడాతో దిండిగల్ ఓడించింది. ఈ మ్యాచ్లో అశ్విన్ బాల్ టాంపరింగ్ పాల్పడ్డారని మధురై పాంథర్స్ సీఈవో డి. పూజ టీఎన్పీఎల్ నిర్వాహకులకు లేఖ రాశారు.
"ఇటీవల దిండిగల్ డ్రాగ్సన్స్తో జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ జరిగింది. ఈ మ్యాచ్లో అశ్విన్, అతడి సహచరులు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదే పదే తుడిచారు. మేము అలా చేయవద్దని హెచ్చరించినప్పటికి మా మాట వినలేదు. అలా చేయడంతో బంతి బరువుగా మారింది. ట్యాంపరింగ్ కారణంగా బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు లోహ ధ్వని విన్పించింది. ప్రస్తుతం ఇదే విషయంపై మా సాంకేతిక బృందం పనిచేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను టీఎన్పీఎల్కు సమర్పిస్తాము" అని లేఖలో పేర్కొంది.
ఈ వివాదంపై టీఎన్పీఎల్ సీఈవో ప్రసన్న కన్నన్ స్పందించారు. "దిండిగల్ డ్రాగన్స్ బాల్ ట్యాంపరింగ్ చేసిందన్న ఫిర్యాదు మాకు అందింది. ఆ ఫిర్యాదును మేము స్వీకరించాము. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరాము. ఆరోపణలలో ఏదైనా నిజం ఉందని అనిపిస్తే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా తగిన ఆధారాలు లేకుండా ఓ ఆటగాడు లేదా ఏదైన ఫ్రాంఛైజీపై ఆరోపణలు చేయడం సరికాదు.
మధురై సరైన ఆధారాలు అందించకపోతే ఆంక్షలను ఎదుర్కొక తప్పదు. ఈ టోర్నీలో ఏ ఫ్రాంచైజీ అయినా టీఎన్పీఎల్ అందించిన టవల్స్ను మాత్రమే ఉపయెగించి బంతి తడిని పోగట్టాలి. సిక్స్ కొట్టిన లేదా అవుట్ అయినా, ఓవర్ పూర్తి అయిన తర్వాత ప్రతీ సారి అంపైర్లు బంతిని చెక్ చేస్తారు. అయితే ఈమ్యాచ్ సమయంలో బంతిలో వారికి ఎటువంటి సమస్య కనిపించలేదని కన్నన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: IND vs ENG; 'అతడేమి తప్పు చేశాడని ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయలేదు'