టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ దీపక్ హుడా ఐదేళ్ల తర్వాత తిరిగి తన సొంత జట్టు బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 సీజన్కు ముందు నెట్ ప్రాక్టీస్ సమయంలో, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాతో హుడాకు వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రాక్టీస్ సెషన్లో పాండ్యా తనను దూషించాడని ఆరోపిస్తూ హుడా జట్టు బయో-బబుల్ నుండి బయటకు వచ్చేశాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించినందుకు అతడిపై బరోడా క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. దీంతో హుడా బరోడాను వదిలి రాజస్తాన్ జట్టుకు వెళ్లిపోయాడు.
అయితే, ఇప్పుడు బరోడా క్రికెట్ అసోసియేషన్తో ఉన్న విభేదాలు తొలిగిపోవడంతో ఆయన తిరిగి తన సొంతగూటికి చేరాడు. ఈ విషయాన్ని బీసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్నేహల్ పారిఖ్ ధ్రువీకరించారు.
"31 ఏళ్ల హుడా మళ్లీ దేశవాళీ క్రికెట్లో బరోడా తరఫున ఆడబోతున్నాడు. అతడు బరోడా నుంచే గొప్ప క్రికెటర్గా ఎదిగాడు. ఇప్పుడు మళ్లీ మా జట్టు కోసం ఆడటానికి తిరిగొచ్చాడు. కృనాల్, హుడాల మధ్య ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు సర్దుమణిగాయి" అని ఐఏఎన్ఎస్ ఇంటర్వ్యూలో పారిఖ్ పేర్కొన్నారు. హుడా కూడా తాను తిరిగి బరోడాకు ఆడబోతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.
హుడాకు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలతో సహా 4,267 పరుగులు చేశాడు. అలాగే టీ20ల్లో 3,972, లిస్ట్-ఎ క్రికెట్లో 3,340 రన్స్ నమోదు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగల హుడా, భారత్ తరఫున ఇప్పటివరకు 10 వన్డేలు, 21 టీ20 మ్యాచ్లు ఆడాడు.
చదవండి: ENG vs SL: శ్రీలంక క్రికెట్ జట్టుకు డబుల్ షాక్


