
ఢిల్లీ క్యాపిటల్స్ (Photo Courtesy: BCCI)
ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అలిసా హేలీతో కలిసి
ఈ క్రమంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇందులో స్టార్క్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య అలిసా హేలీతో కలిసి ఈ పేస్ బౌలర్ సిడడ్నీకి చేరుకున్నాడు. అయితే, అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడేందుకు అతడు నిరాకరించాడు.
భారత్కు తిరిగి వెళ్లడు!
ఈ నేపథ్యంలో స్టార్క్ మేనేజర్ స్పందిస్తూ.. ఐపీఎల్-2025 పునః ప్రారంభమైనా స్టార్క్ భారత్కు తిరిగి వెళ్లే అవకాశం లేదని ఆస్ట్రేలియా నైన్ న్యూస్కు తెలిపాడు. దీంతో మిగిలిన మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్క్ సేవలను కోల్పోనున్నట్లు తెలుస్తోంది.
వారు కూడా దూరమే..!
ఇక మెల్బోర్న్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ కథనం ప్రకారం.. ఒకవేళ తమ ఆటగాళ్లు తిరిగి ఇండియాకు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వారికి పూర్తి మద్దతుగా ఉండనుంది. కాగా స్టార్క్తో పాటు ఆసీస్ కెప్టెన్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్లు ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్ కూడా తిరిగి భారత్ రాకపోవచ్చు.
ఫైనల్ ఆడాలి
ఇప్పటికే సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు.. మే 16 నుంచి ఐపీఎల్-2025 తిరిగి మొదలైనా.. మే 30న ముగుస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, జూన్ 11 నుంచే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 ఫైనల్ ఆడాల్సి ఉంది.
ఇంగ్లండ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే ఈ మెగా మ్యాచ్కు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో భారత్కు వెళ్లి వచ్చి.. వెంటనే మళ్లీ ఈ మ్యాచ్కు సిద్ధం కావడం కాస్త కష్టంగా మారుతంది. ఈ నేపథ్యంలో కమిన్స్, హెడ్లతో పాటు స్టార్క్ కూడా స్వదేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మరోవైపు.. న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మే 25 వరకు నిరభ్యంతర పత్రాల గడువు ఉంది.. కాబట్టి ఆ తర్వాతే ఆటగాళ్లను తిరిగి రమ్మని ఆదేశించే అవకాశం ఉంది.
రూ. 11.75 కోట్ల భారీ ధరకు
కాగా.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్ను రూ. 11.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పటికి అతడు 14 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ తరఫున ఈ సీజన్లో టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. మరోవైపు.. ఢిల్లీ పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కాగా పంజాబ్ కింగ్స్తో గురువారం నాటి ఢిల్లీ మ్యాచ్ ఉద్రిక్తతల కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!