ప్రపంచకప్‌లో టీమిండియాకు రెండోసారి ఇలా..! | Sakshi
Sakshi News home page

CWC 2023: శ్రీలంకపై గ్రాండ్‌ విక్టరీ.. టీమిండియా రెండోసారి ఇలా..!

Published Fri, Nov 3 2023 8:11 AM

CWC 2023: Team India Wins 7 Matches In A Row For The Second Time In ODI World Cup - Sakshi

2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్‌.. ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో భారత్‌ పలు రికార్డులను నమోదు చేసింది. 

ఇందులో ఒకే ప్రపంచకప్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు గెలుపొందిన రికార్డు ఒకటి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంకపై వరుసగా విజయాలు సాధించిన భారత్‌.. 2003 ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గింది.  

ఓవరాల్‌గా చూస్తే ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక వరస విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2003 ఎడిషన్‌లో ఆసీస్‌ వరుసగా 13 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అనంతరం 2007 ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌ వరుసగా 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ రెండు ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా నిలిచింది. 

వరల్డ్‌కప్‌లో ఓవరాల్‌గా అత్యధిక వరుస విజయాల రికార్డు కూడా ఆసీస్‌ పేరిటే ఉంది. ఈ జట్టు వరుసగా 36 మ్యాచ్‌ల్లో (1999లో 7, 2003లో 13, 2007లో 12, 2011లో 4)  గెలిచింది. ఆసీస్‌ 36 వరుస విజయాల జైత్రయాత్రకు 2011 వరల్డ్‌కప్‌లో బ్రేక్‌  పడింది. ఆ ఎడిషన్‌లో పాక్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 36 వరుస విజయాల తర్వాత ఓడింది. 

ఇదిలా ఉంటే, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్‌ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. గిల్‌ (92), కోహ్లి (88), శ్రేయస్‌ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్‌ షమీ (5-1-18-5), మొహమ్మద్‌ సిరాజ్‌ (7-2-16-3), జస్ప్రీత్‌ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్‌ రజిత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement