'మా కెప్టెన్‌ అందుకే జీనియస్' | Sakshi
Sakshi News home page

మా కెప్టెన్‌ నిజంగా జీనియస్‌ : మోరిస్‌

Published Sun, Oct 11 2020 6:56 PM

Chris Morris Praises Virat Kohli Performance Against CSK Match - Sakshi

దుబాయ్‌ : ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఆ జట్టు ఆటగాడు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ప్రశంసలతో ముంచెత్తాడు.శనివారం సీఎస్‌కేఓ జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 90 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌తో 37 పరుగులతో ఆర్‌సీబీ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఒక దశలో 16వ ఓవర్‌ వరకు 116 పరుగులతో నత్తనడకన సాగుతున్న ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను కోహ్లి దూభేతో కలిసి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత మోరిస్‌ మూడు కీలక వికెట్లు తీయడంతో సీఎస్‌కే ఓటమిపాలయింది. మ్యాచ్‌ అనంతరం మోరిస్‌ స్పందించాడు.( చదవండి :రాహుల్‌ ఎవరి మాట వినడా.. అంతేనా?)

'మా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిజంగా జీనియస్‌. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కోహ్లి బ్రిలియంట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తూ టెస్టు మ్యాచ్‌లకు సరిపోలిన వికెట్‌పై మొదట్లో ఆచితూచి ఆడిన కోహ్లి.. ఆ తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 16వ ఓవర్‌ వరకు చెన్నై బౌలర్లకు మంచి అవకాశంగా కనిపించింది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. తాను నిలదొక్కుంటే ఎంత ప్రమాదమో చేసి చూపించాడు. కఠిన పరిస్థితుల్లో చెన్నై బౌలర్లను తట్టుకొని కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లో  ఇన్నాళ్ల అంతర్జాతీయ అనుభవం స్పష్టంగా కనిపించింది. అందుకేనేమో ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో కోహ్లి పేరు కూడా ఉంటుంది. ఒక లీడర్‌గా జట్టును గెలిపించాలని చూసే అతని మార్గదర్శనంలో నడవడం నాకు అదృష్టమనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌ సీజన్‌లో అడుగుపెట్టిన నేను మొదట్టో కాస్త ఒత్తడికి లోనయ్యాను. కానీ నా వంతు ప్రయత్నంగా జట్టును గెలిపించాలనే ప్రయత్నం చేశా. మొదటి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీయడం ద్వారా కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టాను అందుకు సంతోషంగా ఉన్నానంటూ మోరిస్‌ తెలిపాడు. (చదవండి : గేల్‌.. నువ్వు త్వరగా కోలుకోవాలి)

కాగా ఆర్‌సీబీ జట్టు 2019 డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో క్రిస్‌ మోరిస్‌ను రూ.10 కోట్లు చెల్లించి మరీ కొనుక్కున్న విషయం తెలిసిందే. కానీ ఆర్‌సీబీ తాను ఆడిన మొదటి 5 మ్యాచ్‌ల్లో మోరిస్‌ను ఆడించలేదు. స్టెయిన్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, యజ్వేంద్ర చాహల్‌తోనే నెట్టుకొచ్చింది. డెత్‌ ఓవర్ల స్పెషలిస్టగా ముద్ర పడిన క్రిస్‌ మోరిస్‌ బ్యాటింగ్‌లో కూడా రాణించగల సత్తా ఉంది. మరి అలాంటి మోరిస్‌ను ఆర్‌సీబీ ఎందుకు ఆడించలేదన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే మోరిస్‌ విషయంలో ఆర్‌సీబీ స్పందన పక్కనపెడితే కోహ్లి అభిమానులు మాత్రం మోరిస్‌ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. మోరిస్‌ లాంటి అస్ర్తాన్ని మంచి సమయం చూసి దించాలనేది కోహ్లి ఆలోచన అని తెలిపారు. అందుకే సీఎస్‌కేతో జరిగిన ఆరో మ్యాచ్‌ ముందు వరకు మోరిస్‌ను బరిలోకి దించలేదు. అయితే సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో మోరిస్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీసి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు.  ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 12న కేకేఆర్‌తో తలపడనుంది.  

Advertisement
Advertisement