ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి నివాళిగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు.
గతేడాది జూన్ 4న జరిగిన విషాదకర సంఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం ఈసారి ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేయాలని నిర్ణయించాము. ఎలాంటి వేడుకలు లేకుండానే ఐపీఎల్-19వ సీజన్ ప్రారంభం కానుందని సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.
అదేవిధంగా మరణించిన 11 మంది అభిమానులకు కర్ణాటక క్రికెట్ అసోయేషన్, ఆర్సీబీ కూడా ఘన నివాళి అర్పించేందుకు సిద్దమయ్యాయి. వారి జ్ఞాపకార్థం స్టేడియంలోని ఒక స్టాండ్లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నారు.
అంతర్జాతీయ మ్యాచ్లతో సహా, ఈ వేదికపై జరిగే అన్ని కార్యక్రమాల సమయంలో ఆ సీట్లు ఇకపై ఖాళీగా ఉండనున్నాయి. ఆర్సీబీ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనున్నారు. కాగా ఆరంభ వేడుకలను రద్దు చేసిన బీసీసీఐ, క్లోజింగ్ సెర్మనీ మాత్రం ఘనంగా నిర్వహించే అవకాశముంది.
చదవండి: IPL 2026: ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్.. టికెట్లు బుకింగ్ ఎప్పటినుంచి అంటే?


