టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లీగ్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో డకౌటైన అభిషేక్ ఇప్పుడు సూపర్-8 దశలోనూ అదే తీరును కనబరుస్తున్నాడు.
అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ అవుట్గా అభిషేక్ వెనుదిరిగాడు.
టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న అభిషేక్పై భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిషేక్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తూ అందరిని నిరాశపరిచాడు. దీంతో అభిషేక్ను పక్కన పెట్టి సంజూ శాంసన్కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు టీమ్మెనెజ్మెంట్ను సూచిస్తున్నారు.
అదరగొట్టిన మిల్లర్, బ్రెవిస్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు


