టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 బెర్త్లు ఖరారైనప్పటి నుంచి క్రికెట్ అభిమానులు ఓ పదాన్ని తరుచూ వింటూ ఉన్నారు. ఏంటా పదం అంటే.. ప్రీ-సీడింగ్. ఈ ప్రీ-సీడింగ్ పద్దతిని ఐసీసీ ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్ నుంచే ప్రవేశ పెట్టింది.
రెండు దేశాల్లో (భారత్, శ్రీలంక) మ్యాచ్లు జరగాల్సి ఉన్నందున టికెట్లు, ప్రసారాలు, లాజిస్టిక్స్, అభిమానుల ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేయడానికి ప్రీ-సీడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం, జట్లకు ముందే స్లాట్లు కేటాయించబడ్డాయి. పలానా జట్టు సూపర్-8కి చేరితే పలానా గ్రూప్లో ఉంటుందని ముందే నిర్ణయించబడింది.
ఐసీసీ ఈ ప్రీ-సీడింగ్ విధానాన్ని అభిమానులు, ఆటగాళ్ల సౌకర్యార్థం ప్రవేశపెడితే, దీని పర్యవసనాలు విమర్శలకు దారి తీశాయి. ముందుగా కేటాయించబడిన స్లాట్ల ప్రకారం ఆయా గ్రూప్ల్లో టాపర్లుగా ఉన్న జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్ సూపర్-8 గ్రూప్-1లోకి వచ్చాయి. అదే గ్రూప్ల్లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక సూపర్-8 గ్రూప్-2లోకి చేరాయి.
గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి టాపర్లుగా సూపర్-8కి చేరిన జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్కు అదనపు ప్రయోజనాలు ఏమీ దక్కకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. గ్రూప్ దశలో టాపర్లుగా నిలిచిన ఆ జట్లకు అదనపు ప్రయోజనాలు (రెండో స్థానంలో నిలిచిన జట్లతో మ్యాచ్లు) కల్పించాల్సి ఉండిందని అభిప్రాయపడుతున్నారు.
ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ విధానంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు సూపర్-8 బెర్త్లను డీల్ చేసే అధికారాలే వస్తే, తప్పక సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు.
ఈ అశాస్త్రీయ ప్రీ-సీడింగ్ విధానం వల్ల ఇప్పుడు గ్రూప్ దశలో టాపర్ జట్లు సూపర్-8 దశలో ఒకదానితో ఒకటి పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచిన జట్లంతా ఒక దానితో ఒకటి తలపడనున్నాయి.
నిన్న న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరగాల్సి తొలి సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తి తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) మరో రెండు సూపర్-8 మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం గ్రూప్-2లో శ్రీలంక-ఇంగ్లండ్, రాత్రి గ్రూప్-1లో భారత్-సౌతాఫ్రికా తలపడనున్నాయి.


