Indian Idol: స్టేజ్‌పై ఉన్నట్టుండి పాడటం ఆపేసిన సింగర్‌, అంతా షాక్‌

Indian Idol 12: Pawandeep Rajan Suddenly Stopped Singing - Sakshi

కొత్త గొంతుకలను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్‌ ఐడల్‌. ఈ ప్రఖ్యాత పాటల పోటీల్లో పాల్గొన్న వారు భావి గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్నారు. మన తెలుగు సినీ గాయకుడు రేవంత్‌ కూడా ఆ కోవకు చెందిన వాడే. తాజాగా హిందీ ఇండియన్‌ ఐడల్‌ 12వ సీజన్‌ కొనసాగుతోంది. ఈ పోటీల్లో తన పాటలతో మెస్మరైజ్‌ చేస్తున్న పవన్‌దీప్‌ రాజన్‌ అనూహ్యంగా ప్రేక్షకులతో పాటు జడ్జిలను షాక్‌కు గురి చేశాడు. తన్మయత్వంతో పాట పాడుతుండగా అందరూ మరో లోకంలో తేలుతున్న సమయంలో హఠాత్తుగా పవన్‌దీప్‌ అర్ధాంతరంగా పాట ఆపేసి.. ఇక చాలు అని వెళ్లిపోయాడు.

ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను సోనీ టీవీ విడుదల చేసింది. పవన్‌దీప్‌ ‘హోతన్‌ సే చులో తుమ్‌’ పాట పాడుతూ అకస్మాత్తుగా ఆపేశాడు. అంతసేపు ఆసక్తిగా వింటున్న జడ్జిలు ఒకప్పటి నటీనటులు ధర్మేంద, అనితా రాజ్‌ పాట ఆగిపోవడంతో జడ్జిలు, తోటి పోటీదారులు షాకయ్యారు. మైక్‌ ఆపేసి వెళ్తున్న పవన్‌దీప్‌ను మరో పార్టిస్పెంట్‌ నిలువరించి పాటను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రేమ్‌గీత్‌ సినిమాలో ఆ పాటను గజల్‌ కింగ్‌ జగ్జీత్‌ సింగ్‌ పాడారు. ఆయనను మరిపించేలా పాడుతున్న పవన్‌దీప్‌ ఇలా చేయడంతో ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌ దీప్‌ సీజన్‌ మొదటి నుంచి ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేస్తున్నారు. అతడి మధురమైన గాత్రానికి సోషల్‌ మీడియా ఫిదా అవుతోంది. ఇండియన్‌ ఐడల్‌ 12వ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజన్‌ అకస్మాత్తుగా ఇలా చేయడంతో షోలో అతడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న పవన్‌దీప్‌ గతంలో కరోనా బారినపడ్డాడు. దీంతో పవన్‌దీప్‌ వర్చువల్‌గా ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు.
 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top