బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు కాజేసిందని ఆయన తండ్రి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై అషురెడ్డి తండ్రి కూడా స్పందించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అషు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఆడియో క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది అషురెడ్డి పెట్టిన ఆడియో అని వైరలవుతోంది.
ఈ ఆడియోలో మాట్లాడుతూ.. 'ప్రవీణ అక్కకు ఫోన్ చేశావని నాకు కాల్ చేసింది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. నాకు మే వరకు టైమ్ ఇస్తే రూ.1.5 కోటి ఇచ్చేస్తా. మిగిలిన డబ్బులు నా లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా.. లేదు కుదరదు.. అంటే పెద్ద మనుషులకు ఫోన్ చేశావ్ కదా.. నా లైఫ్లో పెద్దమనిషి ప్రవీణ అక్కే.. నువ్వు ఎవరినీ పిలుచుకుంటావో నీ ఇష్టం. నేను ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. లేదు.. కుదరదు అంటే నేనే వేధింపుల కేసు పెడతా. మా అక్కను, అమ్మను ఇందులోకి లాగొద్దు. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి రావడమేంటి? నా తరఫున ప్రవీణ అక్క, వేణుస్వామి వస్తారు.. మే వరకు ఆ డబ్బులు సెటిల్ చేస్తా' అని ఉంది. ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే..
ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు.


