● మహిళల భద్రత కోసం షీటీమ్స్ ● ‘సాక్షి’తో సిద్దిపేట మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ
సిద్దిపేటకమాన్: మీ భద్రతే మా బాధ్యత అంటూ జిల్లాలో మహిళలు, బాలికల రక్షణ కోసం షీటీమ్స్ పనిచేస్తున్నాయని సిద్దిపేట మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో విద్యార్థులు, ఉద్యోగిణులు టీజింగ్కు గురయ్యే ప్రదేశాల్లో ఆకతాయిల ఆట కట్టించడానికి పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఐ దుర్గ గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో కళాశాలలు, ఆర్టీసీ బస్టాండ్లు, మార్కెట్లు, కోమటిచెరువు, రద్దీ ప్రాంతాల్లో సుమారు 50 ప్రాంతాలు హాట్ స్పాట్లుగా గుర్తించామని తెలిపారు. షీ టీం సిబ్బంది మఫ్టీలో ఉండి ఆకతాయిల ఆటకట్టిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్లో మూడు షీ టీం బృందాలు విధులు నిర్వహిస్తున్నాయన్నారు. ఒక్కో టీంలో ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళ పోలీసు కానిస్టేబుళ్లు మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. బాలికలు, మహిళలను వేధించే పోకిరిలను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. బాలికలు, మహిళలు ఏవరైనా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 112, షీటీం నంబర్ 87126 67434కు ఫోన్ చేసి తెలపాలని సీఐ దుర్గ సూచించారు.


