సద్వినియోగం చేసుకోండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్
సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ వచ్చే నెల 12న నిర్వహిస్తున్నట్లు, రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టుతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ పడదగినవి 1,776 కేసులు గుర్తించినట్లు వీటిలో 518 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన లోక్ అదాలత్లో 756 కేసులు పరిష్కరించామని, వీటిలో మోటారు వాహనాల సంబంధిత కేసుల్లో రూ.92లక్షల 26వేల నష్టపరిహారం ఇప్పించామని తెలిపారు. అలాగే గత జూన్లో నిర్వహించిన లోక్ అదాలత్లో 814కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సౌజన్య, న్యాయమూర్తి జయప్రసాద్ పాల్గొన్నారు.
ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
జిల్లా న్యాయమూర్తి సౌజన్య
సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సౌజన్య తెలిపారు. జిల్లా జైలును న్యాయమూర్తి శనివారం సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూమ్ను పరిశీలించి, ఖైదీలకు కల్పిస్తున్న భోజన వసతి గురించి జైలు సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ ప్రతి వారం జైలును సందర్శిస్తారన్నారు. అడ్వకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సెల్స్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
ఎంపీ రఘునందన్రావు
దుబ్బాకరూరల్: గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్రావు అన్నారు. అక్బర్పేటభూంపల్లి మండలం పోతారెడ్డిపేట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రహరీ నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకు వస్తే నిధులు కేటాయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక ఏసురాజ్, బీజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో తగిన వసతులు లేవని ఎంపి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే నిధులు కేటాయిస్తానని తెలిపారు. కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు.
ధ్యాన్ చంద్ యువతకు స్ఫూర్తి
హుస్నాబాద్: నేటి యువత ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది కలిసి క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇస్తూ.. ఆయనను గౌరవించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం క్రికెట్ లో గెలిచిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


