పాలిటెక్నిక్ విద్యార్థుల పోరుబాట
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనియేటివ్స్) విభాగంలోకి పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం 97జీఓను విడుదల చేసింది. దీంతోపాలిటెక్నిక్తో జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీఓతో
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎలాంటి
ఇబ్బంది ఉండదని మంత్రి వివేక్ చెప్పినా, రద్దు చేయాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగుతుండటం గమనార్హం.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ, ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలున్నాయి. వీటన్నింటికీ సాంకేతిక విద్యామండలి అనుబంధ గుర్తింపు ఉంది. వీటిలో సుమారు 5వేలకు మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పీ–సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులందరూ మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తికాగానే ఉన్నత చదువు కోసం ఈ సెట్ పరీక్ష రాసి లెటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో ఎక్కువగా విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై మక్కువ చూపుతున్నారు. సిలబస్, బోధన ప్రణాళిక కూడా సాంకేతిక విద్యా మండలినే రూపొందిస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో
స్కిల్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. దీంతో పాలిటెక్నిక్ ప్రవేశాలు సైతం ఇదే రీతిలో ఉంటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫీజులు పెరిగితే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఉన్నత చదువులకు బ్రేక్
పాలిటెక్నిక్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.. లేదంటే ఉన్నత విద్య చదువుకోవచ్చన్న ఉద్దేశంతో పాలిటెక్నిక్ విద్యను ఎక్కువగా చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈసెట్ లేకపోతే తాము ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరే అవకాశం ఉండదని, దాంతో తాము ఉన్నత చదువులు చదవకుండా ద్వారాలు మూసుకుపోతాయని పాలిటెక్నిక్ విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా సీఎం, మంత్రులు, ఉన్నత అధికారులు స్పందించి 97 జీవోను రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఆ రెండూ ఒక్కటి కాదు..
ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమాను ఒక్కటి చేయాలన్న ఉద్దేశంతో శక్తి స్కీంను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ రెండు ఒక్కటి చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్యకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పించే దాని విషయపై మంత్రి వివేక్ స్పష్టమైన జీవోను విడుదల చేయాలి.
– పవన్కుమార్, విద్యార్థి, ద్వితీయ సంవత్సరం
పాలిటెక్నిక్ సిలబస్ వేరు..
పాలిటెక్నిక్ సిలబస్, ఐటీఐ సిలబస్ రెండు వేరు వేరు. ఈ రెండింటినీ కలిపేందుకు 97జీఓవోను ప్రభుత్వం తీసుకువచ్చింది. వెంటనే ఈ జీవోను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు భరోసాను కల్పించాలి.
–స్నేహ, విద్యార్థి,
తృతీయ సంవత్సరం
విద్యార్థులు, అధ్యాపకుల నిరసన
నంగునూరు(సిద్దిపేట): శక్తిలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, అధ్యాపకుల నిరసనలు కొనసాగుతున్నాయి. టీపీ జేఏసీ పిలుపు మేరకు అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అలాగే విద్యార్థులరు ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వం తెచ్చిన జీఓ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జీవో 97 వెనక్కు తీసుకోవాల్సిందే


