జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
వర్గల్(గజ్వేల్): ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారానే డీలర్లు ఎరువుల అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ఆదేశించారు. గురువారం వర్గల్ మండలం గౌరారం, మజీద్పల్లి, అంబర్పేట, మీనాజీపేట గ్రామాలలో ఎరువుల విక్రయకేంద్రాలు తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ నిర్వహణ తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం వర్గల్ మండలంలో 22 మంది సర్వేయర్లను నియమించామన్నారు. రైతులు విధిగా తమ పంటల వివరాలు సర్వేయర్లతో నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు సన్న వరి రకాలు, ఇతర సన్న వరి రకాలు సాగుచేస్తే సెప్టెంబర్ 10 లోపు సంబంధిత ఏఈఓ, సర్వేయర్లకు తెలిపి నమోదు చేయించుకోవాలన్నారు.
ఉద్యోగుల జేఏసీ మహాధర్నా
సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్
సిద్దిపేటరూరల్: పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గాదరి పరమేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్యాదరి పరమేశ్వర్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో జయశ్రీ, వలిహమ్మద్, ఇంద్రసేనారెడ్డి, విక్రమ్ రెడ్డి, శ్రీధర్, మైపాల్ రెడ్డి, విజేందర్రెడ్డి, రాజిరెడ్డి, రాములు, మధుసూదన్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
సర్కార్ బడుల్లోనే
నాణ్యమైన విద్య
మర్కూక్(గజ్వేల్): సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ లింగయ్య అన్నారు. మండలంలోని పాములపర్తి పీఎంశ్రీ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలో సైన్స్ ల్యాబ్, పాఠశాల గ్రంథాలయం, మధ్యాహ్న భోజన పథకం, స్పోర్ట్స్ మెటీరియల్ వివిధ అంశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. కార్యక్రమంలో మర్కూక్, ములుగు మండల విధ్యాధికారులు వెంకట్రాములు, ఉదయ్ భాస్కర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఫణీంద్రుడు తదితరులు పాల్గొన్నారు


