ఇంకెప్పుడు అమృత్..!
నత్తనడకన పథకం పనులు
రూ. కోట్లల్లో వ్యయం మంచినీటికి తప్పని తిప్పలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో దుస్థితి
మున్సిపాలిటీల్లో దాహార్తిని శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్రం తీసుకొచ్చిన అమృత్– 2.0 పథకం పనులు ఏడాది కాలంగా నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ప్రజలకు మంచినీటి కష్టాలు తప్పడం లేదు. రూ.కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పథకం పనులు జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్తోపాటు సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ముందుకు సాగడంలేదు.
– గజ్వేల్
జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలకు గానూ మూడింటిలో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్–2.0 పథకం పనులు సాగుతున్నాయి. ఇందులోభాగంగానే గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో రూ.28కోట్లు, సిద్దిపేటలో రూ.85కోట్లు, చేర్యాలలో సుమారు రూ.9కోట్లు వెచ్చిస్తున్నారు. పట్టణాల్లో మంచినీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. ఆయా పట్టణాల్లో మంచినీటి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం, కొత్తకాలనీలకు పైప్లైన్ల విస్తరణ, కొత్త నల్లా కనెక్షన్లు, వాటర్ మీటర్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. ఏడాది క్రితం చేపట్టిన ఈ పనులు నత్తనడకన సాగటం ఆందోళన కలిగిస్తోంది.
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలా..
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం ‘మిషన్ భగరీథ’ ద్వారా నిత్యం 39లక్ష లీటర్ల మంచినీటి సరఫరా చేసే వ్యవస్థ అందుబాటులో ఉన్నది. ఉదయం, సాయంత్రం కలిపి రెండుసార్లు 78లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు ఈ నీరు సరిపోకపోవడంతో ప్రస్తుతం అమృత్ 2.0 పథకంలో భాగంగా పట్టణంలోని భారత్నగర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్ల వద్ద 25లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. అంతేకాకుండా కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా వ్యవస్థను తీసుకొచ్చేందుకు 15కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ అదనంగా 50లక్షల లీటర్ల నీటిని పట్టణ ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. కానీ పనులు సాగటం లేదు. కొన్ని కాలనీల్లో పైప్లైన్లకు రోడ్లపై గుంతలు తీసి పనులను అర్ధంతరంగా నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులు పూర్తయి తమకు నీళ్లు ఎప్పుడు వస్తాయోనని ఆయా కాలనీల వాసులు ఎదురుచూస్తున్నారు.
సిద్దిపేట, చేర్యాలలోనూ..
సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ అమృత్ పనుల ఆలస్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆయా మున్సిపాలిటీల్లో ఓవర్హెడ్ ట్యాంకల నిర్మాణానికి స్థలాల గుర్తింపు జరగకపోవడం, పైప్లైన్ల పనుల్లో జాప్యం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న..ఈ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. మరోవైపు బిల్లుల చెల్లింపుల్లో చోటుచేసుకుంటున్న జాప్యం కూడా పనుల్లో ఆలస్యానికి మరో కారణంగా చెబుతున్నారు.
పనుల్లో వేగం పెంచుతాం
పట్టణాల్లో మంచినీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించే సంకల్పంతో అమృత్–2.0 పనులు జరుగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో చేపట్టిన పనుల్లో వేగం పెంచుతాం. ప్రజల దాహార్తిని శాశ్వతంగా నిర్మూలిస్తాం.
– మహేశ్, ఏఈ గజ్వేల్ మున్సిపల్
ఇంకెప్పుడు అమృత్..!
ఇంకెప్పుడు అమృత్..!
ఇంకెప్పుడు అమృత్..!


