ప్రలోభాల పర్వం ఆరంభం
● బాండ్ పేపర్లపై హామీలు గుప్పిస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
● కుల సంఘాల భవనాలకు స్థలం కొనిస్తానని బ్యాంక్ చెక్కులు
● ఇంటింటికీ మాంసం, మద్యం పంపిణీ ● పండుగ చేసుకుంటున్న ఓటర్లు
హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో అభ్యర్థులు తన సొంత మేనిఫెస్టోతో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థుల మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్రావులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచారం తుది దశకు చేరుకోగా, అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గత రెండురోజులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. యువకులకు, పెద్దలకు వేర్వేరు విందులు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ వార్డులో ఓ అభ్యర్థి మహిళల కోసం మినీవ్యాన్లో 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిళ్లు, స్టఫ్ పంచగా, మరో అభ్యర్థి సైతం కూల్ డ్రింక్ బాటిళ్లను పంపిణీ చేశాడు. ఓటర్లు దసరా పండుగను మించి ఓట్ల పండును తెగ ఎంజాయి చేస్తున్నారు. ప్రతీ ఇంటికి మాంసం, మద్యం సీసాలను పంపిణీ చేస్తున్నారు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మందు సీసాను ఓటర్ల ముందు పెడుతున్నారు. ఓటర్లు ఏది అడిగినా కాదనకుండా..ఖర్చుకు వెనకాడకుండా అభ్యర్థులు పంచిపెడుతున్నారు.
బాండ్ పేపర్లపై హామీలు
పలు పార్టీల అభ్యర్థులు ఓటర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే కుల సంఘాలకు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం 2 నుంచి 4 గుంటల స్థలాన్ని సొంత డబ్బులతో కొనిస్తానని బాండ్ పేపర్పై రాసి హామీలను గుప్పిస్తున్నారు. బాండ్ పేపర్తోపాటు బ్యాంక్ చెక్కులు ఇస్తూ ఓటర్లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఓ వార్డులో అభ్యర్థి గెలవక ముందే వందలాది గ్యాస్ కనెక్షన్ కిట్లను పంపిణీ చేసినట్లు వినికిడి. ఓ రెబెల్ బీఆర్ఎస్ అభ్యర్థి తన సొంత మేనిఫేస్టోను విడుదల చేసి ప్రచారం చేస్తున్నాడు. తనను గెలిపిస్తే ఆడబిడ్డ పెళ్లికి రూ.5,016 కానుక, ఆడబిడ్డ పుడితే రూ. 3,016 కానుక, వార్డులో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఇస్తానని హామీలిస్తున్నాడు.


