నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించి యాప్లో అమ్మకాలను నమోదు చేయాలని డీఏఓ పద్మ డీలర్లకు సూచించారు. శనివారం పాలమాకుల రైతు వేదికలో నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల యజమానులకు సీడ్స్ డీలర్ యాప్పై అవగాహన కల్పించారు. వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతు వివరాలు, స్టాక్ నిల్వలు, తదితర వివరాలను యాప్లో ఎలా నమోదు చేయాలో టెక్నికల్ వ్యవసాయ అధికారి మైథిలీ వివరించారు. ఈ సందర్భంగా ఏడీఏ పద్మ మాట్లాడుతూ ఏడు రకాల సన్న రకం వరి పంట పండించిన రైతులకు బోనస్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి షాపులో విత్తనాలను నిల్వ చేసుకోవాలని, అమ్మకం, స్టాక్ వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓలు గీత, పర్షరామ్రెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.


