నమ్మించి.. పుస్తెలతాడుతో ఉడాయించి
చేర్యాల(సిద్దిపేట): చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సీఐ కార్యాలయంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని చుంచనకోటకు చెందిన వృద్ధురాలు మంద గాలమ్మ ఈనెల 4న ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పట్టణ కేంద్రానికి చెందిన ఆరపల్లి వంశీకృష్ణ వెనుక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మీ కూతురు అరటి పండ్లు ఇవ్వమని పంపిందని నమ్మించాడు. అనంతరం తాగు నీరు ఇవ్వమని అడిగాడు. వృద్ధురాలు వంట గదిలోకి వెళ్లడంతో వెంబడించి ఆమె మెడలోని 27 గ్రాముల బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీఐ రమేష్, చేర్యాల ఎస్ఐ నవీన్, కొమురవెల్లి ఎస్ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.
చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు


