ఆడుకోవడానికి గేమ్స్‌ జోన్‌.. | - | Sakshi
Sakshi News home page

ఆడుకోవడానికి గేమ్స్‌ జోన్‌..

Jan 30 2024 5:58 AM | Updated on Jan 30 2024 9:52 AM

సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌లో రెండు రోబోలను హైదరాబాద్‌ నుంచి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ రోబోలు చార్జింగ్‌ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్లగానే ముందుగా రోబోలు కస్టమర్లు కూర్చున్న టేబుల్‌ వద్దకు వెళ్లి ‘నమస్కారం సార్‌, మేడమ్‌.. రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌కు స్వాగతం. నా పేరు మైత్రీ ఫుడ్‌ ఆర్డర్‌ చేయండి సార్‌ అని పలుకుతుంది. మనకు నచ్చిన భోజనం ఆర్డర్‌ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్‌ చేసిన భోజనం ఫ్లేట్‌లో కస్టమర్‌ కూర్చున్న టేబుల్‌ వద్దకు తీసుకొస్తుంది. వేడి వేడి ఆహారాన్ని తీసుకొచ్చాను.. ధన్యవాదాలు సార్‌ అని చెబుతుంది.

ఆడుకోవడానికి గేమ్స్‌ జోన్‌..

ఇలా వినూత్న పద్ధతిలో భోజనం వడ్డిస్తూ కస్టమర్లను, భోజన ప్రియులను ఆకర్షిస్తుంది ఈ రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌. ఇప్పటికే సిద్దిపేటలో ట్రైన్‌ రెస్టారెంట్‌ను నిర్వాహకులు నడుపుతున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్‌లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్‌ జోన్‌, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్‌, హోం థియేటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

వీకెండ్‌లో తాకిడి ఎక్కువ..

ఈ రెస్టారెంట్‌లో ఇతర హోటల్‌లో ఉన్న రేట్ల మాదిరిగానే సాధారణ చార్జీలు ఉంటాయని హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. 20 రోజుల క్రితం ఓపెన్‌ చేసిన హోటల్‌కు కస్టమర్లు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వస్తున్నారని, వీకెండ్‌లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్‌లో అన్ని రకాల చికెన్‌, మటన్‌, ఫిష్‌, ఫ్రాన్స్‌ బిర్యానీలు, ఇతర భోజనాలు, వెజ్‌, నాన్‌వెజ్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని రోబోలతో ఫొటోలు దిగడానికి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేయడానికి కస్టమర్లు హోటల్‌కు క్యూ కడుతున్నారు.

హోటల్‌లో కస్టమర్ల వద్దకు ఆహారాన్ని తీసుకొస్తున్న రోబోలు (మైత్రీ)

Advertisement
 
Advertisement
Advertisement