
యూఎస్లో 100 భారీ బొమ్మల ప్రదర్శన
‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్’ ప్రాజెక్టు
చేపట్టిన ఎన్జీఓ ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’
గజరాజుల బొమ్మల తయారీ భారత్లోనే
మన శిల్పులు, ఇక్కడి మొక్కలతోనే
‘ఏనుగమ్మ ఏనుగు.. మా ఊరొచ్చింది ఏనుగు’ అని భలే సంబరపడిపోతున్నారు అమెరికన్లు. చూడటానికి పరిమాణంలోనూ, రాజసంలోనూ అచ్చం గజరాజుల్లా జీవం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఇవన్నీ చెక్కతో చేసినవి. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా 100 బొమ్మలు! ఆసియాలో వన్యప్రాణుల పరిరక్షణకు పనిచేస్తున్న యూకేకు చెందిన ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్’ పేరుతో వినూత్నంగా నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కుంజర సమూహం యూఎస్లోని ప్రముఖ నగర వీధుల్లో జనానికి వింత అనుభూతిని కలిగిస్తోంది. ప్రదర్శన మాత్రమే కదా, గొప్ప ఏముంది అని కొట్టిపారేయకండి.. ఎందుకంటే ఇవి మనదేశంలోనే రూపుదిద్దుకున్నాయి.
మనదేశంలోని ఆసియా ఏనుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినవి. అలాంటి ఏనుగులు రైలు ఢీకొట్టడం, విద్యాదాఘాతాల వంటివాటి వల్ల మరణించడం చూసి తట్టుకోలేక వాటికోసం 2002లో అప్పటి జైపూర్ రాజకుటుంబం, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఫైన్షాయర్ సర్ ఎవలిన్ డి రాస్చైల్డ్ సంయుక్తంగా ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ని ఏర్పాటుచేశాయి. ఈ సంస్థ ఏనుగుల సంరక్షణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ఒకటి ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’. ఈ ప్రాజెక్టు కోసం.. భారత్లో తయారైన ఈ భారీ ఏనుగుల బొమ్మలు ఇప్పుడు అమెరికన్లు కట్టిపడేస్తున్నాయి.
ఖరీదు కాస్త ఎక్కువే!
ప్రదర్శన అంటే కేవలం చూడటమే కాదు.. ఔత్సాహికులు తమకు నచ్చిన బొమ్మను బుక్ చేసుకోవచ్చు కూడా. ఏనుగు పిల్ల నుంచి భారీ కరిరాజు వరకు శిల్పులు నాలుగు రకాల బొమ్మలు తయారుచేశారు. వీటి ధరలు రూ.6,88,000లతో మొదలై రూ.18,92,000 వరకు ఉన్నాయి. బొమ్మ తయారుచేసి, ఇవ్వడానికి 4–6 నెలల సమయం పడుతుందని ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ చెబుతోంది. తమిళనాడు నీలగిరిలోని గూడలూర్కు చెందిన 200 మంది స్థానిక గిరిజన కళాకారుల సంఘం ‘కో ఎగ్జిస్టెన్ ్స కలెక్టివ్’ చేతిలో ఇవి రూపుదిద్దుకున్నాయి. నీలగిరి ప్రాంతంలో తిరిగే ఏనుగులను పోలిన ఈ బొమ్మలను.. శిల్పులు అయిదేళ్లు శ్రమించి తీర్చిదిద్దారు.
నగరాల వారీగా..
గజరాజుల శిల్పాలను అమెరికా అంతటా తిప్పి, ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2024 జూలైలో న్యూపోర్ట్తో మొదలై న్యూయార్క్ సిటీ, మియామీ బీచ్, హ్యూస్టన్ లలో ఎగ్జిబిషన్ జరిగింది. మోంటానాలోని బ్రౌనింగ్లో జూన్ 4న ప్రారంభమైన ప్రదర్శన జూన్ 16తో ముగిసింది. పశ్చిమ యూఎస్ వయోమింగ్లోని జాక్సన్ హోల్లో మే 17 నుంచి జూన్ 20 వరకు జరుగుతుంది. జులై 1 నుంచి ఈ గజరాజులు కాలిఫోర్నియా వాసులకు కనువిందు చేయనున్నాయి.
సంచరించడానికి స్థలం..
లాంటానా కామరా పుష్పించే ఈ కలుపు మొక్క వేగంగా వ్యాపిస్తుంది. జలావరణాల్లో ఇవి వేగంగా విస్తరించడం వల్ల జంతువులు జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే, ఈ మొక్కలను ఏనుగు బొమ్మల తయారీకి వాడటం ద్వారా.. వన్యప్రాణుల సంచారానికి ఎక్కువ స్థలం ఉంటుందని, అటవీ పునరుద్ధరణకు దోహదపడుతుందనేది ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ ఆలోచన. ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’ ద్వారా సేకరించే నిధులను.. మానవులు, వన్యప్రాణుల సామరస్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు.